క్షమాపణలతో మొసలి కన్నీళ్లు వద్దు అంటూ ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించిన ధర్మాసనం
న్యూఢిల్లీ,మే 19,2025: కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. కల్నల్ సోఫియా ఖురేషిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆయన చెప్పిన క్షమాపణను కోర్టు తిరస్కరించింది. తాను చేసిన తప్పులకు మంత్రి క్షమాపణ చెప్పినా.. అవి హృదయపూర్వకంగా లేవని, చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి ఆడే డ్రామాలంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.
“మీరు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆలోచన లేకుండా ఉన్నవి. మాకు మీ క్షమాపణ అవసరం లేదు. ఇవి నిజమైన పశ్చాత్తాపానికి సంకేతం కాదు. ఇవి మొసలి కన్నీళ్లు మాత్రమే” అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్వీ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొంది.
కేవలం విమర్శించడమే కాకుండా.. ప్రజా ప్రతినిధిగా ఉన్న కున్వర్ విజయ్ షాకు కోర్టు కొరడా ఝళిపించింది. “మీరు వినియోగించే ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి. మేము మీ వీడియోలన్నీ చూశాం. మీరు అసభ్యకరమైన భాష వాడే చివరి అంచులకు చేరుకున్నారు” అని పేర్కొంది.
ఇటీవల ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి మీడియా ముందు వచ్చిన కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.
ఈ కేసు విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరపాలని భావించిన ధర్మాసనం.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈ SITలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉండాలని, అందులో ఒకరు మహిళా అధికారిణి కావాలని కోర్టు స్పష్టం చేసింది.
అంతేకాదు, ఈ ముగ్గురు అధికారులు మధ్యప్రదేశ్ రాష్ర్టం బయటి నుంచే ఉండాలని, కనీసం ఇన్స్పెక్టర్ జనరల్ (IG) హోదాలో ఒకరు ఉండాలని, మిగిలిన ఇద్దరు కూడా SP కన్నా తక్కువ ర్యాంక్లో ఉండకూడదని స్పష్టమైన మార్గనిర్దేశం చేసింది. ఈ SITను మే 20వ తేదీలోపు ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.


It’s really a cool and useful piece of info. I am happy that you shared this useful information with us. Please stay us up to date like this. Thank you for sharing.