పేపర్ బాయ్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకూ… దైనంపల్లి ప్రవీణ్ కుమార్ విజయయాత్ర యువతకు స్ఫూర్తి

ములుగు జిల్లా ఏటూరునాగారం గ్రామంలో జన్మించిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్ జీవిత ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్… పారిశుధ్య కార్మికురాలైన తన నాయనమ్మ  చేతుల్లో పెరిగాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ చదువు మీద ఉన్న పట్టుదలతో ముందుకు సాగారు.

నాయనమ్మ కూలి పనులు చేస్తూ పోషించగా, ప్రవీణ్ చదువును ఆపకుండా కొనసాగించారు. ఎన్నో కష్టాలు, ఒంటరితనం, సామాజిక అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు. ఆ పట్టుదలే ఆయనను ఉన్నత శిఖరాగ్రానికి చేర్చింది.

తొలుత తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలో 105వ ర్యాంకు సాధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఎంపికయ్యారు. అయితే అక్కడితో ఆగకుండా మరింత ఉన్నత లక్ష్యం కోసం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో సుదీర్ఘ కాలం కోచింగ్ తీసుకుంటూ పట్టుదలతో చదువును కొనసాగించారు. కష్టాలను సవాలుగా తీసుకుని అవిరామంగా శ్రమించారు. చివరికి UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష–2025లో 793వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించి మరో గొప్ప విజయాన్ని అందుకున్నారు.

ప్రవీణ్ విజయానికి ఆయన పట్టుదలే ప్రధాన కారణమని చెప్పవచ్చు. కష్టాలు వచ్చినప్పుడల్లా తల్లి చెప్పిన మాటలు – “బాగా చదువుకో… లేకపోతే కూలీగా మిగిలిపోతావు” – ఆయనకు ఎప్పుడూ ప్రేరణగా నిలిచాయని చెబుతున్నారు. అదే మాటలు ఆయనను మళ్లీ మళ్లీ పుస్తకాల వైపు నడిపించాయి.

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆయన కొన్ని ముఖ్య సూచనలు కూడా చేస్తున్నారు. కోచింగ్ సద్వినియోగం చేసుకోవడం, గ్రూప్ స్టడీ చేయడం, కరెంట్ అఫైర్స్‌తో పాటు స్టాటిక్ సబ్జెక్టులను క్రమం తప్పకుండా చదవడం, పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించడం వంటి అంశాలు విజయానికి కీలకమని సూచిస్తున్నారు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలపాటు కేంద్రీకృతంగా చదవడం, సమయ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా అవసరమని పేర్కొంటున్నారు.

చదువుకుంటూనే కుటుంబానికి సాయం చేసేందుకు పేపర్ బాయ్‌గా, కూలి పనులు కూడా చేసిన సందర్భాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అయినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం వదల్లేదు.

ప్రముఖ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ స్ఫూర్తితో సివిల్ సర్వీసెస్‌లోకి రావాలని భావించిన ప్రవీణ్… పేదలు, అట్టడుగు వర్గాలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు.

అడవి ప్రాంతంలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు… రాష్ట్ర స్థాయిలో డీఎస్పీగా ఎంపికై, జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ ర్యాంక్ సాధించడం గొప్ప ప్రేరణాత్మకమైన విషయం. ముఖ్యంగా పేద కుటుంబాల యువతకు, మొదటితరం విద్యార్థులకు ప్రవీణ్ కథ ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది.

కష్టాలు ఉన్నాయని ఆగిపోకండి… అవే మనల్ని నిలబెడతాయి. పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు” అని ప్రవీణ్ యువతకు సందేశం ఇస్తున్నారు.

దైనంపల్లి ప్రవీణ్ కుమార్ సాధించిన ఈ విజయం… తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల యువతలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ఆయన భవిష్యత్తులో దేశానికి మరిన్ని సేవలు అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం