Headlines

యుద్ధంలో గెలిచి ఉండవచ్చు..అయినా కాశ్మీర్లో ఆగదే చిచ్చు

INDO PAK

పెహల్గాం సంఘటన తర్వాత
ఒక్కసారిగా అప్రమత్తమైన
భారత ప్రభుత్వం..
వెనువెంటనే పాకిస్తాన్ పై
యుద్ధం ప్రకటించి
తన శౌర్యాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పింది.
పనిలో పనిగా పాకిస్తాన్లోని
ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసి మన ఆయుధ సంపత్తి..మన రక్షణ సామర్థ్యం
ఏపాటిదో దాయాది
పాకిస్తాన్ కే గాక
అటు చైనా..అమెరికా దేశాలకు కూడా బోధపడేలా చేసింది..

ఇక్కడి వరకు బాగానే ఉంది.
మొన్న జరిగిన పరిణామాల పట్ల ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు.
అయితే..అయితే..

పెహల్గాం దాడి తర్వాతే పాకిస్తాన్ బుద్ధి..
ఉగ్రవాదుల నైజం మనకు
తెలిసివచ్చాయా..
ఎన్ని దాడులు..
ఎన్నెన్ని అకృత్యాలు..
ఇంకెన్ని మారణహోమాలు.. జరిగాయో..
జరుగుతున్నాయో..
దేశ విభజన నాటి నుంచీ..

ఇన్నాళ్లు మనం గాలింపులు..
ఏరివేతలు చెయ్యలేదని కాదు.
దురదృష్టవశాత్తు వాటిలో చాలా వరకు మొక్కుబడిగా
చేసినవే..ఒక దాడి జరిగినపుడు హడావిడి చెయ్యడం..ఆగిపోవడం..
ఇదే పంథా..

మొత్తానికి కాశ్మీరీల జీవితం..
ఇటు ఉగ్రవాదులు..
అటు పాకిస్తాన్ ఒత్తిళ్లు..
పోలీసులు..సైన్యం నుంచి వేధింపులు..
స్థానిక రాజకీయాలు..
దశాబ్దాల తరబడి
సౌకర్యాల లేమి..
భద్రత కొరత..
పిల్లలు..ముఖ్యంగా యువత
భవితపై నమ్మకం కొరవడి
నిత్య ఆందోళన..
ఇలా దినదిన గండం అన్న తీరున సాగుతుంది..
వీటన్నిటికి తోడు
భారత ప్రభుత్వ నిర్లిప్త
వైఖరి కారణంగా కూడా చెప్పలేనన్ని ఇబ్బందులు పడ్డారు..ఎప్పుడో ఒకప్పుడు కాదు..అనునిత్యం..క్షణక్షణం!

సరే..మొన్న పెహల్గాం సంఘటన తర్వాత
భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించి పాకిస్తాన్ పై యుద్ధం చేసింది.ఈ యుద్ధం లక్ష్యం విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి.
అవి పక్కన పెడదాం.
గతంలో ఎన్నో దురాగతాలు జరిగినా రాని రోషం మొన్నటి సంఘటనతోనే ఎందుకు వచ్చింది..మొన్నటి దురాగతం
కాశ్మీర్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనదని అనుకోవద్దు.
ఇలాంటివి చాలా జరిగాయి.
బయటకు రాని ఇంతకంటే తీవ్రమైన దురాగతాలు కూడా కాశ్మీర్లో చోటు చేసుకున్నాయి.
అయితే పెహల్గాం
ఉదంతంలోని తీవ్రత ఏంటంటే..
మతం అడిగి మరీ చంపారన్నది..దాంతో పెహల్గాం దురాగతాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
చాలా తీవ్రమైనదిగా పరిగణించింది.దేశం మొత్తం కూడా ఈ ఘటనను అలాగే భావించింది.
అదే బిజెపి సర్కార్ను ఇంకా బలంగా యుద్ధంవైపు ప్రేరేపించింది.కారణం ఊహకు
అందనిదైతే కాదు.బిజెపి
ఏ అంశం ప్రధాన ఆయుధంగా ఆధికారంలోకి వచ్చిందీ.. కొనసాగుతున్నదీ..
మళ్ళీ మళ్ళీ గెలుస్తూ వస్తున్నది అందరికీ తెలిసిందే.
బీజేపీ ఉనికే ఆ అంశం చుట్టూ పెనవేసుకుని ఉందన్నదీ విదితమే.

ఓకే..మతం అడిగి చంపినందుకు బుద్ధి చెప్పాల్సిందే..అయితే
మతం కంటే.. ఇతర అంశాల కంటే ముఖ్యమైనది జనం ప్రాణాలు..ఇన్ని వందలు వేల మరణాలు జరిగినపుడు
రాని ఆవేశం ఇప్పుడు వచ్చింది.

యుద్ధం అనుకోగానే సైన్యం ఏం చేసింది..ఉగ్రవాద శిబిరాలు ఎక్కడున్నాయి అనే విషయం తమకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టు
క్షణాల మీద దాడులు జరిపి
సుమారు వందమంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టు
చెప్పుకుంది.

లిప్తపాటులో ఇంత తీవ్రమైన దాడి జరిపి అంతమందిని చంపగలిగినప్పుడు ఎప్పుడో
అది చేసి ఉండాల్సింది కదా..
అలా చేసి ఉంటే మొన్నటి పెహల్గాం ఉదంతం జరిగి ఉండేదే కాదు. అది మాత్రమే కాదు ఎన్నో మారణహోమాలు తప్పి ఉండేవి.పోనీ ఆర్టికల్ 370 రద్దుకు ముందైనా.. వెనువెంటనే అయినా ఆ పని చేసి ఉండాల్సింది కదా.!

నిజానికి కాశ్మీర్లో జరుగుతున్న దురాగతాలు ఎక్కడి నుంచో ఎవరో వచ్చి చేస్తున్నవి కావు.
ప్రణాళికలు బయట తయారు కావొచ్చు.. అమలు చేసేది చేస్తున్నది కాశ్మీర్లో ఉన్నవారే.
అంటే వారిని పట్టుకోడం భారత ప్రభుత్వానికి
అంత కష్టమైన పనేం కాదు.ఇన్నాళ్లు అది చేయకపోవడమే కాశ్మీర్
కల్లోల్లాలకు ప్రధాన కారణం.
అయితే ఇది ప్రస్తుత బిజెపి సర్కార్ తప్పిదం మాత్రమే కాదు..దశాబ్దాల పాటు భారత ప్రభుత్వాలు..అవలంబిస్తూ వచ్చిన ఒక వైఖరి..విధానం..

పోనీ..మొన్న యుద్ధం శాశ్వత పరిష్కారాన్ని చూపిందా అంటే
లేదు..నిజానికి యుద్ధం చివరికంటా చేసి పాకిస్తాన్ అనే దేశాన్ని నామరూపాలు లేకుండా చేసినా గాని కాశ్మీర్లో
ఉగ్రవాదం ఆగిపోయేది కాదు.
ఇలా చెప్పడానికి కారణాలు అనేకం..తీవ్రవాదం కాశ్మీర్లో అంతర్గతంగా కూడా ఉంది.
ముందే చెప్పుకున్నట్టు కాశ్మీర్లో దురాగతాలు ఎవరో బయటి నుంచి వచ్చి చేస్తున్నవి కావు.
కాదంటే పాకిస్తాన్ అనే దేశం లేకపోతే మద్దతు తగ్గి కొంత పలచబడే అవకాశం ఉంటుందేమో..ఇక పాకిస్తాన్ అంతమైపోతే..అన్న అంశం..
తదనంతర పరిణామాలు
ఇప్పుడు చర్చించవలసినవి కావు..అవి మరీ పెద్ద ఊహాగానాలు అవుతాయి.

ఇప్పుడు కాశ్మీర్ అంతర్గత పరిస్థితులే ప్రధాన అంశం.
వాటి మీదనే ప్రధానంగా దృష్టి పెట్టాలి.మొన్నటి యుద్ధం తర్వాత పాకిస్తాన్ చేతులు ముడుచుకుని కూర్చోదు.
కాల్పుల విరమణ ఒప్పందాన్నే
అలవోకగా ఉల్లంఘించిన పాక్
కాశ్మీర్లో మరిన్ని కల్లోలాలు సృష్టించకుండా చేతులు ముడుచుకుని కూర్చోదు.
అందులోనూ బహిరంగ యుద్ధంలో గెలవలేమని
బాగా తెలిసివచ్చాక
ఇక కుట్రలు..కుతంత్రాలు..
దొంగ దాడులు..
ఇవే ప్రధానంగా ముందుకు వెళ్తుంది పాకిస్తాన్!

ఫలితంగా కాశ్మీరీలు
మరింత సంకట పరిస్థితులు
ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
మత ప్రాతిపదికన కాశ్మీర్లో కొంతమంది పాకిస్తాన్ ఆలోచనల వైపే మొగ్గు చూపుతారు.

ఇటు మన దేశంలో కూడా
మత కల్లోలాలు సృష్టించి
ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను
పాకిస్తాన్ ముమ్మరం చేస్తుంది.
ఇప్పటికే దేశీయంగా జరుగుతున్న కొన్ని కుట్రల కారణంగా జనాల్లో ఒక రకమైన మతపర ఆవేశాలు చోటు చేసుకుని ఉన్నాయి.వాటినే ఆధారం చేసుకుని పాక్ వ్యూహాలు రచించుకోవచ్చు..
బహుపరాక్..

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE