పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టు.. వర్తమాన కాలంలో భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీటికి నెహ్రూ ని బాధ్యుడిని చేసి మాట్లాడడం సంఘ్ పరివారానికి ఒక అలవాటుగా మారింది. ఆ నేరెటివ్స్ ని ఉన్నది ఉన్నట్టుగా నమ్ముతున్న వాళ్ళు కూడా సమాజంలో అధికం అయ్యారు. ముఖ్యంగా యువతరం ఈ అబద్దపు ప్రచారాలకు ఎక్కువగా లోను అవుతున్నారు. సింధు జలాల ఒప్పందం విషయంలో కూడా ఇదే రకమైన అబద్దపు ప్రచారాలు ప్రజల్లోకి చొప్పిస్తున్నారు.
సింధు నది ఒప్పందాన్ని మోది ప్రభుత్వం రద్దు చేయలేదు. Kept in abeyance. ప్రస్తుతానికి పక్కన పెట్టింది. ఉరి ఘటన తర్వాత 2016 లో సింధు జలాల ఒప్పందాన్ని సమీక్ష చేయడానికి మోదీ ప్రభుత్వం కేబినెట్ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఒక high level committee వేశాడు. ఇందులో నీటిపారుదల నిపుణులు, విదటిట్ రంగ నిపుణులు, ఆర్థిక వేత్తలు, పర్యావరణ వేత్తలు సభ్యులుగా ఉన్నారు. 8 ఏళ్లు అయినా ఆ కమిటీ తేల్చింది ఏమీ లేదు. సింధు ఒప్పందాన్ని పక్కన పెట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు సింధు నది జలాలను ఆపడానికి లేదా మళ్ళించడానికి మన దేశం వద్ద infrastucture లేదు. ఇప్పుడున్నవి జల విద్యుత్ ఉత్పత్తికి ఉద్దేశించిన డ్యాంలు. వాటిని river runoff projects అంటారు. అంటే విద్యుత్ ఉత్పత్తి తర్వాత ఆ నీళ్ళు నదిలోకి వెళ్లిపోతాయి. ఇవి హిమాలయ నదులు కాబట్టి ఏడాది పొడుగున నదిలో ప్రవాహాలు ఉంటాయి. వానా కాలంలో అధికంగా ఉంటాయి. సింధు దాని 5 ఉప నదుల నుంచి వచ్చే అపారమైన జల రాశిని నిలువ చేయడానికి high dams ను నిర్మించాలి. ఆ నిల్వ నీటిని వ్యవసాయానికి , ఇతర నదీ బెసిన్లకు మళ్ళించడానికి కొండలను తొలిచి వందల కిలోమీటర్ల టన్నెల్స్ తవ్వాలి. ఇవి ఖర్చుతో కూడుకున్నవి, సమయం తీసుకుంటాయి, హిమాలయ పర్యావరణానికి అపారమైన నష్టాన్ని సృష్టిస్తాయి. పైగా హిమాలయ పర్వత శ్రేణులు highest seismic zone గా వర్గీకరించన ప్రాంతం. భూకంపాలు వచ్చినప్పుడు dam break అయితే అది సృష్టించే విలయం ఊహకు అందనిది. కాబట్టి సిద్ధూ నదిపై ఎత్తైన డ్యాంలను నిర్మించడం కుదరదు. లద్దాక్ ప్రాంత ముఖ్య పట్టణం లే ముంపులోకి వస్తుంది. high dams నిర్మించకుండా సిందు నదిలో లభ్యమయ్యే అపారమైన జలరాశిని మనం ఆపలేం, వాడుకోలేమనే స్పృహ నెహ్రూ కు ఉంది. అట్లే high dams ను నిర్మించడం కూడా సాధ్యపడదన్న అవగాహన కూడా ఆయనకు ఉన్నది. భారతదేశం సింధు నదీ వ్యవస్థలో పైన ఉన్నది. మనవి కొండ ప్రాంతాలు. పాకిస్తాన్ lower elevation లో ఉంది. మైదాన ప్రాంతాలు, డెల్టా భూములు ఉన్నాయి. మనం ఎంత వాడుకున్నా తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదుల నీళ్ళను మాత్రమే వాడుకోగలం. పశ్చిమాన ఉన్న చీనాబ్, ఝీలం , సింధు నదుల జలాలను నిలువ చేయలేము, అందుకే ఆ నదులను పాకిస్తాన్ కు వదిలేయడం జరిగింది. వాటిపై జల విద్యుత్ కేంద్రాలను నిర్మించి విద్యుత్ ఉత్పత్తి తర్వాత నీటికి నదిలోకి వదిలేయడం జరుగుతుంది. ఇవి కూడా ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉన్న డ్యాంలు కావు. పశీమాన ఉన్న ఆ మూడు నదుల నీటిని మనం వాడుకోలేమన్న అవగాహన నెహ్రూ కి ఉంది కాబట్టే ఆ ఒప్పందం పై సంతకాలు చేశాడు. ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి , బియాస్, సట్లెజ్ జలాలను మన అవసరాలకు ఇంకా పూర్తిగా వినియోగంలోకి తీసుకు రాలేకపోయినాయి మన ప్రభుత్వాలు. పాకిస్తాన్ లో హై డ్యాం లతో పాటు మైదాన ప్రాంతాల్లో సుక్కూర్ బ్యారేజి కూడా ఉంది. వాటి ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు మళ్ళించగలుగుతున్నారు. హై డ్యాంల వద్ద విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. సింధ్ ప్రాంతంలో సాగునీటి వ్యవస్థలు.. సుక్కూర్ బ్యారేజి సహా బ్రిటిష్ కాలంలోనే నిర్మాణం అయ్యింది. దానికి సాంకేతిక సలహాలు ఇచ్చిన వాళ్లలో మోక్షగుండంతో పాటు మన నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కూడా ఒకరు. ఈ సంగతి ఎం వి తన ఆత్మ కథలో రాసినాడు. IWT ను అబియన్స్ లో పెట్టినందు వలన ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ కు జరిగే నష్టం ఏమీ లేదు. భవిష్యత్తులో high dams కట్టి, కొండలను తొలిచి నీటిని మళ్లించినా సింధు నదీ వ్యవస్థలో ఉత్పన్నం అయ్యే అపారమైన జల రాశి కిందకి పోవలసిందే. ఎందుకంటే నీటిని నిల్వ చేయడంలో డ్యాంలకు కూడా పరిమితులు ఉంటాయి. ఎండా కాలం మంచు కరిగి వస్తున్న నీటిని ఆపి వేసే అవకాశం ఉంది. అందుకు విద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాల్సి ఉంటుంది. తక్కువ ధరకు లభించే పర్యావరణ హిత విద్యుత్తు కోల్పోవడానికి భారత్ సిద్దపడుతుందని నేను అనుకోవడం లేదు. భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవికంగా ఆలోచిస్తే IWT సరి అయినదే. 12 ఏండ్ల పాటు నిపుణులు విస్తృతంగా చర్చించిన తర్వాతనే ఈ ఒప్పందం ఖరారు అయ్యింది తప్ప నెహ్రూ మెదడులో నుంచి తయారు అయిన ఒప్పందం కాదు.

శ్రీధర్ రావు దేశ్ పాండే
నీటిపారుదల రంగ నిపుణులు