Headlines

ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవ సభలో సిఎం ఎమోషనల్ స్పీచ్

cm revanth reddy


  • తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఈ విషయంలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి వర్గం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
  • రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,జిసిసి చైర్మన్ తిరుపతి, స్థానిక ఎమ్మెల్యేలు… నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ ప్రాంతంలో ఉన్న మాచారంలో సోమవారం ప్రారంభించారు.
  • రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మాచారంకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులకు కలెక్టర్ బాదావత్ సంతోష్, ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతంం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్థానికంగా ఉన్న సీతరామాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
  • ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజనుల కోసం రూ.12,600 కోట్లకు సంబంధించిన నల్లమల డిక్లరేషన్ను ఆవిష్కరించారు. అంతకు ముందు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం పైలాన్ను ప్రారంభించారు. అనంతరం మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ … ఒకప్పుడు నల్లమల్ల ప్రాంతం అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతమని… ఎవరో నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలనే వారు… కానీ ప్రస్తుతం ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించిన మహేంద్రనాథ్, ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్రెడ్డి, రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావులు పుట్టిన ప్రాంతమని…ఈ విషయంలో తను నల్లమల్ల బిడ్డగా ఎంతో గర్వంగా ఉందన్నారు. పాలమూరు జిల్లా బిడ్డలను అప్పట్లో అన్ని ప్రాంతాల్లో కూలీ పనులు చేసేందుకు పిలిచేవారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
  • అలాగే ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో నల్లమల్ల డిక్లరేషన్ సహచర మంత్రి వర్గంతో కలిసి చేయడం సంతోషమని… అప్పట్లో తాను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను గెలించాలని ఎన్నికల సమయంలో తాను కోరగా యాభైవేల పైచిలుకు మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించారని.. ప్రస్తుతం 65 మంది శాసనసభ్యులు ఉండటం వల్ల తాను నల్లమల్ల బిడ్డ గా చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఎంత బాధ్యత ఉందో తనకు ముఖ్యమంత్రిగా అంతే బాధ్యత తనకు ఉందని… నల్లమల్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని… నిధులు విడుదల చేయాలని… ఈ ప్రాంతంలో ఉద్యోగ, విద్యను అందించాలని మంత్రులకు తెలియజేశానన్నారు. ఈ ప్రాంతంలో రైతన్నలు దున్నుకుంటే పోడుభూములు మంచి భూములుగా మారాయని… ప్రస్తుతం గిరిజనులు ఆత్మగౌరవంతో ఉండే విధంగా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు తమ చెంచు ఆడపడుచులతో మాట్లాడితే అలివేలు అనే మహిళ తోటల పెంపకం గురించి అవగాహన కల్పించుకున్నారని ఈ విషయంలో ఆనందకరంగా ఉందన్నారు. అలాగే ఇళ్ళకు, వ్యవసాయ అవసరాలకు సోలార్ విద్యుత్తుపై అవగాహన కల్పించడంతో పాటు సోలార్తో విద్యుత్తు అవసరాలు తీర్చుకునేలా ఇళ్ళకు సైతం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్కు ఆదేశాలిచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ సోలార్ పంపుసెట్లను రాబోయే వంద రోజుల్లో ఉచితంగా అందచేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో అచ్చంపేట ప్రపంచానికి, దేశానికి ఆదర్శమని తెలిపారు.
  • 2023 డిసెంబరు 7వ తేదీన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. అప్పట్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వరి వేస్తే ఉరి వేసుకున్నట్లేనని చెప్పారని కానీ తమ ప్రభుత్వంలో సన్నరకం వడ్లను పండించినట్లయితే రూ.500 బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం వరి పండిస్తే ఉరి వేసుకోవడం మాట పక్కనపెట్టి లాభం చేకూరుతుందని… సన్న వడ్లు పండించమని తాను చెప్పిన రోజు కొందరు నాయకులు అవహేళన చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా అందరికీ సన్నబియ్యం అందిస్తున్నామని… ఈ విషయంలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల ఇళ్ళల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సన్నబియ్యంతో భోజనాలు చేసిన మాట వాస్తవమన్నారు. ప్రస్తుతం రేషన్ బియ్యం ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా మారిందన్నారు. రైతులు పండించిన సన్నవడ్లను తిరిగి ప్రజలకు సన్న బియ్యంగా అందిస్తున్నామన్నారు.
  • రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెలా మూడు కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని…గృహజ్యోతి, మహాలక్ష్మీ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అలాగే ఆడబిడ్డలు, పొదుపు సంఘాల సభ్యులకు ఆర్టీసీ బస్సులను సైతం ఇచ్చి వాటికి ఆడబిడ్డలను యజమానులను చేసిన ఘనత తమకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఒకప్పుడు సోలార్ అంటే అదాని, అంబానీలకే అనుకునే వారని… ప్రస్తుతం ఆడబిడ్డలకు, గిరిజన పుత్రులకు సైతం అందించడం జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకులు సైతం కేటాయించి వారే స్వయంగా నడిపే విధంగా చేశామన్నారు. ఆడబిడ్డలకు హైదరాబాద్ శిల్పారామం పక్కన స్థలం కేటాయించి వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి అదాని, అంబానీలతో పోటీ పడే విధంగా చేశామన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని.. ఒక ఆడబిడ్డ ఆర్థికంగా నిలబడి ఎదిగితే ఆ కుటుంబం, ఆ ప్రాంతం ఎదుగుతుందని తెలిపారు. ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతులను, నిరుద్యోగులు, విద్యార్థులను ఆదుకున్న ఘనత తమకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు60 వేలు ఇవ్వగా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా చోటు కల్పించినట్లు తెలిపారు. అదే విధంగా 12 యూనివర్సిటీల్లో వైస్ఛాన్సలర్లను నియమించినట్లు అప్పుడే సరైన విద్య అందుతుందని అందుకు తార్కాణంగా వారిని నియమించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేషన్ స్కూళ్ళను కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే హైదరాబాద్కు ప్రపంచ దిగ్గజ కంపెనీలను తీసుకురావడం జరిగిందని… ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
  • అలాగే శాంతిభద్రతల విషయంలో సైతం తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని… పన్నుల వసూళ్ళలో సైతం నెంబర్ వన్ రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. పాలమూరు జిల్లా వారికి పాలన చేతకాదని అవహేళన చేసే వారికి తాము తట్ట, పార పనితో పాటు పరిపాలన కూడా చేస్తామని ఏడాదిన్నరలో నిరూపించామన్నారు. ఈ విషయంలో మరింత ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే అచ్చంపేటను ఆదర్శంగా తీర్చదిద్దినట్లే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేయడం జరుగుతుందని అందుకు ప్రజల సహకారం ఎంతైనా అవసరమన్నారు. అప్పట్లో భూమి కోసం… భుక్తి కోసం పోరాటాలు స్వేచ్ఛ, భూమి కోసం జరిగిన పోరాటాలని… వాటిని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి తెలిపారు. పేదలకు 25 లక్షల ఎకరాల భూములను అందించి పేదలకు ఆత్మగౌరవాన్ని అందించిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
  • ఇందిరమ్మ రాక ముందు వెట్టిచాకిరీ చేసేవారని అసైన్మెంట్ పట్టాల కింద భూములు అందించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఇందిరాగాంధీ వల్లే సాధ్యమైందన్నారు. పెహల్గామ్ విషయంలో మాట్లాడుతూ…ప్రధానమంత్రి ఎలా ఉండాలంటే ఇందిరాగాంధీ 54 సంవత్సరాల క్రితంలా ఉండాలని ప్రతి ఒక్కరికీ తెలిసివచ్చిందన్నారు. ప్రతి పేదవారి గుండెల్లో తండాల్లో, గూడేల్లో ఇందిరాగాంధీ ఉన్నారని తెలిపారు. అందువల్లే ఈ పథకానికి ఇందిరా సోలార్ వికాసం పథకంగా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ విషయంలో కొందరు కుట్రలు చేస్తున్నారని వారిని ఎలా తిప్పి కొట్టాలో తమకు తెలుసన్నారు. అలాగే స్కూళ్ళు, రెసిడెన్షియల్ హాస్టళ్ళలో ఆడబిడ్డలకు 200 కాస్మొటిక్ ఛార్జీలు పెంచడంతో పాటు 50 లక్షల కుటుంబాలు గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
  • ప్రజలకు నిజం ఏమిటో తెలుసునని… నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు ఈ విషయంలో ముందుండాలన్నారు. అలాగే బ్యాంక్ లింకేజీ ద్వారా ఆడబిడ్డలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే ఆదర్శంగా నిలుపుతానని… అందుకు 24 గంటల పాటు శ్రమిస్తానని దీనికై ప్రతి ఒక్కరి ఆశీస్సులు అవసరమన్నారు. అనంతరం అచ్చంపేట నియోజకవర్గానికి రూ.119 కోట్లతో స్వయం సహాయక బృందాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందచేశారు. గిరిజనులకు మంచి చేసే తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు జ్ఞాపికలను అందచేశారు.
  • గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాచారం లో చేపట్టిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయ వంతం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బీడుభూముల్లో జలకళ ఉట్టిపడేలా దేశానికే ఆదర్శంగా నూతన ఒరవడితో పథకాన్ని విజయవంతం చేశారు. అతితక్కువ సమయంలో ఆదివాసుల బీడు భూముల్లో సోలార్ పవర్ తో జల సిరి తెచ్చిన అధికారులను ముఖ్యమంత్రి మంత్రులు అభినందించారు. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరి డాక్టర్ శరత్ ఐఏఎస్, మన్ననూరు ప్రాజెక్టు అధికారి రోహిత్ ఐఎఫ్ఎస్, అడిషనల్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ సర్వేశ్వర్ రెడ్డి,శంకర్ రావు జనరల్ మేనేజర్ లను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి,మంత్రులు అభినందించారు.
Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE