ఉట్నూర్ మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ గజదొంగను పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ఉట్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వరుసగా ఏడు ఇళ్లలో దొంగతనాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ కేసులో అదే మండలానికి చెందిన టేకం రామారావును నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడిపై ఇప్పటికే మొత్తం 36 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. గతంలో కరీంనగర్, సిద్దిపేట్ ప్రాంతాల్లో దొంగతనాలు చేసినందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే విడుదలైనట్లు తెలిపారు.
జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మంచిర్యాలలో ఒక స్కూటీ దొంగిలించి ఉట్నూరుకు వచ్చిన నిందితుడు, ఊరి శివారులో ఉన్న పాడుబడ్డ ఇళ్లలో మరియు నిర్మాణంలో ఉన్న ఇళ్లలో తలదాచుకుని రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు.
దొంగిలించిన బంగారం, వెండి ఆభరణాలతో మంచిర్యాల వైపు పరారవుతుండగా కొత్తగూడ ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉన్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అతని వద్ద నుంచి 11.4 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఈ మీడియా సమావేశంలో ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఎస్సై గుంపుల విజయ్తో పాటు పోలీస్ సిబ్బంది ఆర్. శ్యామ్ రావు, బి. నరేష్, ఐ. సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

