ఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.
ముఖ్యంగా హైదరాబాద్–బెంగళూర్, హైదరాబాద్–చెన్నై మధ్య ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్లపై ఆయన సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన హైస్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ బాధ్యతను రైల్వే శాఖ RITES కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించింది. ఈ నేపథ్యంలో RITES ప్రతినిధులు ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో కారిడార్ ప్రణాళికలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ప్రజెంటేషన్లో ప్రతిపాదిత మార్గాలు, అలైన్మెంట్లు, స్టేషన్ల ఎంపిక, భౌగోళిక పరిస్థితులు, సాంకేతిక అంశాలు వంటి విషయాలను వివరించారు. ప్రతిపాదిత మార్గాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవివరంగా పరిశీలించి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా అనుకూల మార్గాల ఎంపికపై పలు సలహాలు, సూచనలు అందించారు. ముఖ్యంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన మార్గాలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కే.ఎస్. శ్రీనివాసరాజు, సెక్రటరీ (కోఆర్డినేషన్) డాక్టర్ గౌరవ్ ఉప్పల్, RITES ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హైస్పీడ్ రైలు కారిడార్ల అమలు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రవాణా రంగంలో కొత్త దశ ప్రారంభమవుతుందని, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి ఇది దోహద పడనుంది.


Really excellent information can be found on web blog.