హైదరాబాద్, ఎల్బీ స్టేడియం:
రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఎల్బీ స్టేడియంలో “1st EDITION OF TELANGANA LEGISLATOR’S SPORTS AND CULTURAL MEET-2026” ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం లో ప్రసంగించారు.
రాజకీయాల్లో నిత్యం నిమగ్నమై, ప్రజా సమస్యల పరిష్కారానికి విరామం లేకుండా శ్రమించే వారికి క్రీడలు ఒక ఉత్తమమైన అవకాశమని సీఎం అన్నారు. ఈ వేదికపై ప్రతిభ ప్రదర్శన మాత్రమే కాకుండా క్రీడా స్ఫూర్తి పెంపొందించుకోవడం ముఖ్యమని తెలిపారు.
ఈ మైదానంలో శిక్షణ పొందిన పలువురు నేడు మంత్రివర్గంలో ఉన్నారని గుర్తు చేశారు. క్రికెట్లో దేశానికి కీర్తి తెచ్చిన మొహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం మంత్రివర్గ సభ్యుడిగా ఉన్నారని, రంజీ క్రికెట్ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడాశాఖ మంత్రిగా ఉన్నారని చెప్పారు.
ఒకప్పుడు క్రీడలకు ఉన్న ప్రాధాన్యం తెలంగాణ ఏర్పాటుకు తర్వాత తగ్గిపోయిందని పేర్కొన్న సీఎం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమగ్ర స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ‘సీఎం కప్’ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఒలింపిక్స్లో తగిన స్థాయిలో పతకాలు రాలేదని, కేవలం 3 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా మాత్రం గణనీయమైన గోల్డ్ మెడల్స్ సాధించిందని ఉదాహరణగా చెప్పారు. అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీలు కూడా గొప్ప ఫలితాలు సాధిస్తున్నాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఆసక్తి పెంచుకుని రాణించాలని సీఎం పిలుపునిచ్చారు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీను హైదరాబాద్కు తీసుకువచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనిపై ప్రతిపక్షాలు వివాదం సృష్టించాయని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రావడం ద్వారా హైదరాబాద్ ఖ్యాతి ప్రపంచానికి తెలియజేసే అవకాశం లభిస్తుందని చెప్పారు.
యువత ఫామ్ హౌస్ పార్టీలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అలాగే గచ్చిబౌలి స్టేడియం, బేగంపేట హాకీ మైదానాలను కూడా ప్రపంచ స్థాయి క్రీడా వేదికలుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
గతంలో ఫుట్బాల్లో దేశానికి పతకాలు తెచ్చిన ఏడుగురిలో నలుగురు మన ప్రాంతానికి చెందిన వారేనని గుర్తుచేసిన సీఎం, మళ్లీ అలాంటి ప్రతిభావంతులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.



