రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

cm revanth reddy

ఈ సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సభకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మెదక్ ప్రాంతానికి ఇందిరా గాంధీకి ఉన్న అనుబంధం గుర్తు చేశారు. “ఇందిరమ్మ పేరు చెప్పగానే మెదక్ గుర్తొస్తుంది. ఆమె చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా ఉన్నారు. అటువంటి స్థలం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. నిమ్జ్ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోక పోయాయని, తమ ప్రభుత్వం వచ్చాక భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచి, భూసేకరణ వేగవంతం చేసినట్లు తెలిపారు. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ సంస్థ ఇక్కడ పనులు ప్రారంభించబోతుందని ప్రకటించారు.

నిమ్జ్ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఈ బాధ్యతను స్థానిక మాజి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అప్పగించినట్టు వెల్లడించారు. ఆ కుటుంబాలకు భోజనం పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడతామని చెప్పారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులు ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. అలాగే నారాయణఖేడ్ నియోజకవర్గానికి కూడా నిధులు మంజూరు చేయబోతున్నట్లు ప్రకటించారు.

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ చేశామని, రైతు భరోసా పథకాన్ని రూ.12 వేలకి పెంచామని, భూమిలేని పేదలకు కూడా భరోసా అందిస్తున్నామని తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, స్వయం సహాయక సంఘాల మహిళలకు బస్సులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

“ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా, వచ్చే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం” అని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, “ఇంటికో ఉద్యోగమంటూ ప్రజలను మోసం చేశారు. కానీ మేము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నాం” అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం అని పేర్కొన్నారు. “రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అవసరమైతే ఎన్నిసార్లయినా ప్రధాని మోదీని కలుస్తాం” అని తెలిపారు.

పార్టీ వాదనలు ఎన్నికల సమయంలో ఉంటాయని, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనన్నారు. ప్రతిపక్ష నాయకుడిని శాసనసభకు రావాలని, ప్రజల సమస్యలపై చర్చించాలని కోరారు. “మేము ఏదైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. కానీ అసెంబ్లీకి రాకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారు” అని హెచ్చరించారు.

“గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా. సీఎం అయిన తర్వాత కూడా ఎప్పుడూ అహంభావం చూపలేదని, అందరినీ కలుసుకుంటూ ముందుకెళ్తున్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకూ నేను నిద్రపోవడం లేదు” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE