రానున్న కృష్ణ,గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం
గోదావరి పుష్కరాల కోసం రూ.200 కోట్ల బడ్జెట్
కాళేశ్వరం, మే 15,2025: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గంగా హారతికి సమానంగా భక్తులను విశేషంగా ఆకట్టుకున్న “సరస్వతి నవరత్నమాల హారతి” దర్శించి కన్నుల పండువగా ఆస్వాదించారు.

ఈ హారతిని రచించిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావును సీఎం ప్రత్యేకంగా సన్మానించారు. కాశీ గంగా హారతి నిర్వహించే పండితులను ప్రత్యేకంగా ఈ హారతి కోసం ప్రభుత్వం ఆహ్వానించడమే కాక, తొమ్మిది హారతులతో కూడిన ఈ కార్యక్రమం భక్తులని ఆకట్టుకుంది. “సరస్వతి నమోస్తుతే” కీర్తనతో ప్రారంభమైన హారతి, జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన “అచ్యుతం కేశవం”, కాళిదాసు విరచిత “మాణిక్యవీణా” స్తోత్రాలతో కొనసాగింది. రావణ బ్రహ్మ రచించిన “శివతాండవ స్తోత్రం”తో శివుడికి హారతి నిర్వహించారు.

పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు తర్వాత హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ,
“తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తున్నాం. నదులు మన నాగరికత మాత్రమే కాదు… దేవతలుగా భావించే భాగ్యమైన పుణ్యప్రవాహాలు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఇవే ముహూర్తం లాంటివి.”
పీవీ, శ్రీపాదరావు సేవలు గుర్తు
మంథని నియోజకవర్గానికి చెందిన దివంగత నేతలు పీవీ నరసింహారావు, శ్రీపాద రావు చేసిన సేవలను సీఎం కొనియాడారు.

“ఇప్పుడు శ్రీధర్ బాబు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కృషితో రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.”
రాబోయే గోదావరి పుష్కరాల కోసం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మంత్రుల స్పందనలు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,
“కాశీ నుండి గంగా హారతి పండితులను తీసుకొచ్చాం. 12 రోజుల పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేశాం. కాళేశ్వరాన్ని పిలిగ్రిమ్ టూరిజంగా అభివృద్ధి చేస్తాం.”
రామగిరి కోట అభివృద్ధి, బస్ స్టాండ్ నిర్మాణానికి నిధులు కావాలంటూ సీఎంను కోరారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
“3 నెలలుగా పుష్కరాల ఏర్పాట్లలో తలమునకలమయ్యాం. భక్తుల కోసం టెంట్ సిటీ, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం. ప్లాస్టిక్ నదిలో పడేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.”
ఇతర మంత్రుల అభిప్రాయాలు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్ధిక పరిస్థితి కష్టంగా ఉన్నా, ప్రజల ఆకాంక్షల మేరకు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రజలందరికీ సరస్వతీ దేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, జయశంకర్ భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ ఇతరఉన్నతాధికారులు పాల్గొన్నారు.