Headlines

శాంతి సందేశ వనం -తెలంగాణ బుద్ధవనం

peace greenery

తెలంగాణాలో బౌద్ధ ధర్మ చరిత్రను తిరిగి ప్రజలకు పరిచయం చేయాలనే సంకల్పంతో రూపొందిన “బుద్ధవనం” ప్రాజెక్టు, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా నిలిచింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో 274 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంగణం, బౌద్ధమతానికి చెందిన మూడు ప్రధాన ప్రక్రియలైన థెరవాద, మహాయాన, వజ్రయాన ప్రవాహాల ఆనవాళ్లను ఒకేచోట చూపించే ప్రాధమిక కేంద్రంగా అభివృద్ధి చేశారు.

బుద్ధవనం ప్రాంగణంలో సిద్ధార్థుని జీవిత ఘట్టాలు, పూర్వజన్మల జాతక కథలు, వివిధ దేశాల బౌద్ధ స్తూపాల నమూనాలు, ధ్యాన కేంద్రం, బౌద్ధ శిల్పాల మ్యూజియం, మహాస్తూపం వంటి అనేక విభాగాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

స్తూపవనంలో భారతదేశంలోని సాంచి, సారనాథ్, అజంతా వంటి ప్రసిద్ధ బౌద్ధ స్తూపాలతో పాటు, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, థాయిలాండ్, ఆఫ్గనిస్తాన్, మయన్మార్ వంటి దేశాల శిల్పకళను ప్రతినిధిగా చూపించే మినీ స్తూపాలను తయారు చేశారు.

ధ్యానవనంలో శ్రీలంక ప్రభుత్వం అందించిన 27 అడుగుల ఆవుకాన బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయబడింది. ఇది శాంతియుత ధ్యానానికి మార్గం చూపుతుంది.

మహాస్తూపం – ఆధ్యాత్మిక ఆకర్షణ

బుద్ధవనం ప్రాజెక్టులో కేంద్ర ఆకర్షణగా నిలిచిన మహాస్తూపం అమరావతి శిల్ప శైలిని ఆధారంగా తీసుకుని నిర్మించబడింది. 42 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో నిర్మించబడిన ఈ స్థూపం త్రివిధ నిర్మాణాలతో – వేదిక, అండం, హార్మికాతో ఉన్నది. ఇందులో బుద్ధుని జీవిత ఘట్టాలు, జాతక కథలు, బౌద్ధ చిహ్నాలను శిల్పాల రూపంలో చిత్రించారు.

స్థూపం లోపల వర్చువల్ స్కై వ్యూ ఏర్పాటు చేశారు. 960 కమలదళాలు, 528 స్కై ప్యానెల్స్‌ను జర్మన్ సాంకేతికతతో రూపొందించి, పై భాగం గగనతలాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. దీని ద్వారా సందర్శకులకు భౌతిక నిర్మాణానికి అటూ అవలోకనం, ఇటూ ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.

బుద్ధవనం ప్రాజెక్టు 2017, 2019లో “తెలంగాణ బౌద్ధ సాంస్కృతిక సదస్సులు” నిర్వహించింది. వివిధ దేశాల నుండి వచ్చిన మోన్కులు, పరిశోధకులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాదు, బుద్ధ జయంతి, ధమ్మ దీక్షా దినోత్సవం, ధమ్మ దీపోత్సవం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

భూటాన్, వియత్నాం, లడఖ్, మంగోలియా దేశాల బౌద్ధ ప్రతినిధులు ఈ ప్రాజెక్టును సందర్శించడం ద్వారా ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

2023 అక్టోబర్ 29న, ప్రముఖ నటుడు గగన్ మాలిక్ బహుకరించిన బుద్ధుని మరియు 8 అర్హంతుల పవిత్ర అవశేషాలను మహాస్తూపంలో ప్రతిష్టించారు. ఇవి మయన్మార్‌, ఇండోనేషియా, కాంబోడియా దేశాల నుండి వచ్చిన అరుదైన పవిత్ర అవశేషాలు కావడం విశేషం.

ప్రాజెక్ట్‌కు విశిష్టమైన గుర్తింపుగా 2022 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణా టూరిజం అవార్డు, పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు, అంతర్జాతీయ BBIN టూరిజం మిత్ర అవార్డులు లభించాయి.


Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE