చెల్లెలి అవశేషాలు తవ్వి బ్యాంక్కి మోసుకెళ్లిన అన్న…ఖాతాలో ఉన్న ₹19,300 కోసం తిప్పలు
కియోంజర్ (ఒడిశా):
ఒడిశా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో ఒక వ్యక్తి తన చెల్లెలి ఖాతాలో ఉన్న డబ్బు తీసుకునేందుకు ఆమె అవశేషాలను బ్యాంక్కి మోసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.
డియానాలి గ్రామానికి చెందిన జీతూ ముండా అనే వ్యక్తి ఈ పని చేశాడు. అతని చెల్లెలు కాక్రా ముండాకు మల్లిపాసి లోని ఒడిశా గ్రామీణ బ్యాంక్లో ఖాతా ఉంది. ఆమె రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఒక కుమారుడు ముందే చనిపోవడంతో జీతూనే ఏకైక బంధువు.
చెల్లెలి ఖాతాలో ఉన్న ₹19,300 తీసుకునేందుకు జీతూ బ్యాంక్కు వెళ్లాడు. అయితే ఖాతాదారు స్వయంగా రావాలని లేదా లీగల్ హేర్ పత్రాలు తీసుకురావాలని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. లేదంటే డబ్బు ఇవ్వలేమని చెప్పాడు.
చదువు లేని జీతూకు మరణ ధృవీకరణ పత్రం లేదా ఇతర పత్రాలు లేవు. ఈ విధానం అర్థం కాక తిరిగి వెళ్లిపోయాడు. ఏం చేయాలో అర్ధం కాక
జీతూ గ్రామంలోని శ్మశానానికి వెళ్లి చెల్లెలి అవశేషాలను తవ్వి తీసి గుడ్డలో చుట్టి, సుమారు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ బ్యాంక్కి చేరుకున్నాడు.
ఈ ఘటన చూసిన స్థానికులు షాక్కు గురయ్యారు. కొందరు ఆవేదన చెందాగా , మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బ్యాంక్ అధికారులు స్థానికంగా ధృవీకరణ చేసుకోవచ్చని, కానీ పత్రాలపై మాత్రమే ఆధారపడటం ఏమిటని మండి పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జీతూని సమాధాన పరిచి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మానవతా దృష్టితో పరిష్కరిస్తామని, బ్యాంక్ నుంచి వివరణ కోరామని తెలిపారు.
─Ends.

