హైదరాబాద్: మటన్ పేరుతో బీఫ్ను హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలపై హైదరాబాద్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్), సీసీఎస్, ఫుడ్ సేఫ్టీ అధికారులు, వెటర్నరీ వైద్యుడు, హబీబ్నగర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.
జూలై 1న మల్లేపల్లిలోని ఉస్మాన్ మీట్ షాప్పై నిర్వహించిన తనిఖీల్లో మహ్మద్ ఉస్మాన్, మహ్మద్ జహంగీర్లను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వీరు బీఫ్ను మేక మాంసం (మటన్)గా చూపించి హైదరాబాద్లోని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
దాడుల్లో సుమారు 50 కిలోల బీఫ్ను అధికారులు స్వాధీనం చేసుకుని అనంతరం నిర్వీర్యం చేశారు.
ఈ కేసులో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ఎక్కడెక్కడికి సరఫరా చేశారనే అంశంతో పాటు ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. మటన్ బిర్యానీ ఆర్డర్ చేసిన వినియోగదారులకు తెలియకుండానే బీఫ్ వడ్డించి ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నిందితుల నుంచి మాంసం తీసుకున్న హోటళ్లు ఏవో గుర్తించి, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరారు.
అయితే, ఈ కేసుతో సంబంధం ఉన్న హోటళ్ల పేర్లను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు. సరఫరా వ్యవస్థపై పూర్తి స్థాయిలో విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

