జపాన్ పర్యటనలో భాగంగా…జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన జపాన్ తెలుగు సమాఖ్య
టోక్యో, జపాన్:
జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని తెలంగాణ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిపై తన దృక్పథాన్ని తెలుగు వారితో ఆయన పంచుకున్నారు.
రాష్ట్రంలో ఐటీ, ఫార్మా రంగాల్లో తగిన స్థాయిలో అభివృద్ధి సాధించామని ఆయన చెప్పారు. డ్రై పోర్ట్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ను పరిశీలించిన విషయాన్ని ఆయన చెప్పారు. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. మూసీ నది శుభ్రత విషయంలో కొన్ని విఘ్నాలు ఉన్నప్పటికీ, శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఢిల్లీ కాలుష్యంతో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన పరిస్థితిని ఉదాహరణగా పేర్కొంటూ, మనం అలాంటి పరిస్థితిని నివారించాలంటే మూసీ ప్రక్షాళన అవసరమని చెప్పారు.
మూసీ శుద్ధి, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్ల అభివృద్ధి రాష్ట్ర పురోగతికి ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెరగాలని, వాటి ద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలని, ఎవరి పరిధిలో వారు చేసే సహకారం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని చెప్పారు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని ఆయన కోరారు.
సొంత ప్రాంత అభివృద్ధిలో భాగం కావడం ద్వారా వచ్చే సంతృప్తి ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిన విషయం అన్నారు.