Site icon MANATELANGANAA

వన దేవతల జన జాతర మేడారం

మహా జాతర మేడారం

అడవుల్లో పుట్టిన ఒక గిరిజన మహిళ పోరాటం తరతరాల విశ్వాసంగా మారింది. రాజ్యాధికారం, దోపిడీకి ఎదిరించిన సమ్మక్క త్యాగమే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక సమాగమంగా మారింది. అదే శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర. ఇది కేవలం ఒక పండుగ కాదు… గిరిజన ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. కాకతీయుల కాలంలో కోయ గిరిజన సమాజానికి చెందిన సమ్మక్క సామంతుల అన్యాయానికి ఎదిరించి పోరాడింది. ఆ పోరాటంలో ఆమె అడవుల్లో అంతర్ధానమైందన్న విశ్వాసమే దేవతారూప ఆరాధనకు నాంది పలికింది. సమ్మక్క కుమార్తె సారలమ్మ కుమారుడు జంపన్న కూడా తల్లి బాటలోనే ప్రజల కోసం పోరాడి వీరమరణం పొందరని గిరిజన కథనం. అందుకే మేడారంలో విగ్రహాలు ఉండవు గద్దెలే దేవతల నివాసాలు. వేదమంత్రాలు ఉండవు… గిరిజన సంప్రదాయాలే పూజలు. బెల్లం నైవేద్యం, కుంకుమ–పసుపు, కోళ్ల బలి, వెదురు గద్దెలు… ఇవే మేడారం జాతర ప్రత్యేకతలు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో లక్షల కాదు… కోట్ల మంది భక్తులు పాల్గొంటున్నారు. అడవుల్లో మొదలైన ఆరాధన నేడు దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతికి గుర్తింపుగా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రలే కాకుండ, ఛత్తీస్గర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , ఒరిస్సా వంటి చుట్టుపక్కల రాష్ట్రల నుండి లక్షల్లో భక్తులు ప్రతి రెండేండ్లకు ఇక్కడికి చేరుకొని తమ కోరికలు తీర్చమని వనదేవతలకి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇంతటి గొప్ప జాతర కి 1996 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా ని కల్పించింది. ఈ సంవత్సరం జరిగే జాతర కి గతం లో ఎప్పుడు లేనంతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్లని కేటాయించి మాస్టర్ ప్లాన్ ద్వారా జాతర గద్దెల ప్రాంగనాన్ని ఆధునీకరించింది. కొన్ని వందల సంవత్సరాలు మాన్నికగా ఉండేలాల పూర్తి రాతి కట్టడాలతో ఈసారి మేడారం జాతర భక్తులకి కనువిందు చేయనుంది. రాతి కట్టడాలపై చిత్రీకరించిన ఆదివాసీ సంస్కృతికి చెందిన బొమ్మలు గిరిజన జాతి ఆచరాలకి అద్దంపడుతున్నాయి. గత జాతరకి 2 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి 3 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు చెందిన పణులని దాదాపు 6 నెలల ముందే ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాక మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు పంచాయత్ రాజ్ శాక మంత్రి సీతక్క పర్యవేక్షణ లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సారధ్యం లో ఈసారి మేడారం పనులు తుది మెరుగులు దిద్దుకుంటుంది.

2026 మహా జాతర పిలుస్తుంది

జనవరి 28 వ తేదీ
సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మను, కొండాయి నుంచి గోవింద రాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభం అవుతుందని,

జనవరి 29 వ తేదీ
సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెల పై రాక,

జనవరి 30వ తేదీ
వన దేవతలకు భక్తులు మొక్కులు,

జనవరి 31 వ తేదీ
సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు వన దేవతలు వన ప్రవేశంతో జాతర ముగింపు.

మేడారం జాతర 2026 మీకోసం సిద్ధమైంది ఇలా

ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక సమాగమంగా గుర్తింపు పొందిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర–2026ను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా ఉండటంతో, జాతర నిర్వహణను సాధారణ పండుగగా కాకుండా ఒక మహా పరిపాలనా కార్యాచరణగా రూపొందించారు.

భక్తుల రాకపోకలు, భద్రత, మౌలిక వసతులు, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాల్లో ఎక్కడా లోటు లేకుండా చూడాలనే లక్ష్యంతో మొత్తం 21 శాఖలను భాగస్వాములుగా చేసుకుని సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయి. జాతర ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లు, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్‌కు జిల్లా స్థాయి అధికారిని జోనల్ అధికారిగా, ప్రతి సెక్టార్‌కు మండల స్థాయి అధికారిని నియమించారు. జాతర కాలంతో పాటు ముందస్తు ఏర్పాట్లు, అనంతర నిర్వహణను దృష్టిలో పెట్టుకుని మొత్తం 42,027 మంది సిబ్బందిని విధుల్లోకి దింపారు. ఇందులో జాతర ప్రధాన నాలుగు రోజుల్లోనే 30,904 మంది అధికారులు, సిబ్బంది సేవలందించనున్నారు.
భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో రహదారులు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో మొత్తం 525 రహదారి సంబంధిత సమస్యలను గుర్తించి అన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. మొత్తం 49 రహదారుల్లో మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టగా, 10 కొత్త రహదారులు, 3 కొత్త కల్వర్టులు నిర్మించారు. వాహనాల నియంత్రణ కోసం ఏకదిశ, ద్విదిశ రూట్లను స్పష్టంగా గుర్తించి ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేస్తున్నారు.

పార్కింగ్ అవసరాల కోసం మొత్తం 42 ప్రదేశాల్లో 1,418 ఎకరాల విస్తీర్ణాన్ని గుర్తించారు. ఇందులో 235 ఎకరాలు అటవీ శాఖ పరిధిలో, 1,183 ఎకరాలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. కొన్ని చోట్ల పంట కోత ఆలస్యం, నీటి ముంపు వంటి సమస్యలు ఎదురైనా, సంబంధిత శాఖలు రైతులతో సమన్వయం చేసుకుంటూ పార్కింగ్ ఏర్పాట్లు పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి.

రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జాతర పనుల కోసం రూ.202.70 కోట్ల వ్యయంతో 24 ప్రధాన పనులు చేపట్టారు. గద్దెల పునర్నిర్మాణం, నాలుగు లైన్ల రహదారుల అభివృద్ధి, ప్రధాన జంక్షన్ల సుందరీకరణ, హెలిప్యాడ్ల మరమ్మతులు వంటి కీలక పనులు ఇందులో ఉన్నాయి.

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా 84 పనులు చేపట్టగా, వీటి వ్యయం రూ.53.21 కోట్లుగా ఉంది. రహదారి మరమ్మతులు, క్యూ లైన్ షెడ్లు, సుందరీకరణ పనులు ఉన్నవి . గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా చేపట్టిన పార్కింగ్ అభివృద్ధి, గిరిజన మ్యూజియం మరమ్మతులు వంటి పనులు కూడా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషిస్తోంది. జాతర ప్రాంతంలో 517 బోట్స్ కేంద్రాలు, 47 సిస్టర్న్లు, 312 ట్యాపులు, 10 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,700 మరుగుదొడ్లు, 285 టాయిలెట్ బ్లాకులు సిద్ధం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడటానికి టీజీఎన్‌పీడీసీఎల్ విస్తృత చర్యలు చేపట్టింది. జాతర ప్రాంతంలో 911 విద్యుత్ స్థంభాలు, 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొబైల్ కమ్యూనికేషన్ కోసం 60 సెల్ టవర్లు, 33 సెల్ ఆన్ వీల్స్, 450 వీఏచ్‌ఎఫ్ సెట్లు ఏర్పాటు చేసి అన్ని ప్రధాన నెట్‌వర్క్‌ల ద్వారా పూర్తి కవరేజ్ కల్పించారు.

రవాణా కోసం టీజీఎస్‌ఆర్టీసీ ఈసారి చరిత్రలోనే అతిపెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 4,000 బస్సులు, 51,000 ట్రిప్పులు నడపాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఈ సారి సుమారు ఇరవై లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని ఆధికారులు అంచనా వేస్తున్నారు. వైద్య సేవల పరంగా 5,192 మంది వైద్య సిబ్బందితో పాటు 108 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు. అగ్నిమాపక భద్రత కోసం 15 ఫైర్ ఇంజిన్లు, 268 మంది ఫైర్ సిబ్బంది, జంపన్నవాగులో భద్రత కోసం 210 మంది ఈతగాళ్లు, SDRF బృందాలను మోహరించారు.

భక్తుల సౌకర్యం, భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తోంది. అన్ని శాఖల సమన్వయం, కాలపరిమితిలో పనుల పూర్తి లక్ష్యంతో ఈ మహా జాతరను మరోసారి ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలపాలనే దిశగా పాలన ముందుకు సాగుతోంది.

మేడారం జాతర- డిజిటల్ జాతర

భక్తుల సౌకర్యమే లక్ష్యంగా మేడారం జాతర–2026కు ఈసారి తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట వేసింది. లక్షలాది కాదు… కోట్లాది మంది భక్తులు తరలివచ్చే మహాజాతరలో సమాచార లోటు లేకుండా చూడాలనే ఉద్దేశంతో “medaramjathara2026” పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రారంభించడంతో పాటు medaramjathara2026.com అనే అధికారిక వెబ్‌సైట్ ని ప్రారంభించింది, అదే విధంగా ప్రత్యేకoగా My Medaram Whatsapp చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవలంటే భక్తులు 7658912300 నెంబర్ ని తమ ఫోన్ లో సేవ్ చేసి Whatsapp లో Hi అని టైపు చేయడం ద్వారా ఈ సేవలు వాడుకోవచ్చు, చాట్‌బాట్‌ సేవలు ఆంగ్లము మరియు తెలుగులో అందుబాటులో ఉండేలా అధికారులు దీనిని తయారు చేశారు.

మేడారం జాతర యాప్‌లో భక్తులకు అవసరమైన అన్ని సేవలను ఒక్క క్లిక్‌తో అందించేలా రూపకల్పన చేశారు. పరిసర వైద్య శిబిరాలు, 108 మరియు బైక్ అంబులెన్సుల లొకేషన్లు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, టాయిలెట్లు, పార్కింగ్ ప్రదేశాలు, తాగునీటి చలివేంద్రాలు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ వంటి కీలక సదుపాయాల వివరాలు స్పష్టంగా చూపిస్తున్నారు. దేవతల గద్దెల చలనం, ఆలయ స్థానం, ప్రధాన ల్యాండ్‌మార్కులు మ్యాప్ రూపంలో అందుబాటులో ఉండటంతో భక్తులు దారితప్పే పరిస్థితి లేకుండా ఏర్పాట్లు చేశారు.

భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ యాప్‌లో ప్రత్యేక సేఫ్టీ మాడ్యూల్ను రూపొందించారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క బటన్ నొక్కగానే సహాయం కోరే SOS అలర్ట్, సంఘటనల నివేదిక, ఫిర్యాదుల నమోదు, తప్పిపోయిన వ్యక్తుల సమాచారం, మిస్సింగ్ కేసుల వివరాలు వంటి అంశాలను ఒకే చోట పొందుపరిచారు. ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ద్వారా భక్తులకు తక్షణ మార్గనిర్దేశం అందేలా వ్యవస్థను సిద్ధం చేశారు.
ఇక medaram2026 వెబ్‌సైట్ మరియు చాట్‌బాట్ జాతర తేదీలు, సేవల లొకేషన్లు, రవాణా సూచనలు, అత్యవసర సహాయ వివరాలపై భక్తులు అడిగే ప్రశ్నలకు చాట్‌బాట్ వెంటనే సమాధానాలు ఇస్తోంది. అధికారిక సమాచారమే అందేలా ఈ వేదికలను రూపొందించడంతో వదంతులు, అపోహలకు తావు లేకుండా చేయాలనే ఉద్దేశం తో దీనిని తయారు చేశారు.

మేడారం జాతర–2026ను సంప్రదాయ విశ్వాసంతో పాటు ఆధునిక సాంకేతికతని మేళవించి మహా నిర్వహణగా నిలిపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భక్తుల అరచేతిలోనే జాతర సమాచారాన్ని ఉంచేలా రూపొందించిన ఈ యాప్, వెబ్‌సైట్, చాట్‌బాట్‌లు… ఈసారి మేడారాన్ని నిజంగా ఒక డిజిటల్ మహాజాతరగ మార్చానున్నాయి.

ప్లాస్టిక్ రహిత మేడారం మనందరి లక్ష్యం – అరణ్యమే ఆలయం… ప్రకృతే దేవత

శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక సమాగమం కాదు. అది అరణ్యంతో మమేకమైన దేవతా విశ్వాసం, ప్రకృతితో అనుబంధమైన ఆదివాసీ జీవన తత్వం. గుడి గోపురాల కంటే అడవులే పవిత్రమన్న భావనతో, శిల్పాల కంటే వనదేవతలే ప్రధానమన్న ఆలోచనతో మేడారం జాతర శతాబ్దాలుగా కొనసాగుతోంది.

మేడారం అడవులు కోయా గిరిజన తెగకు చెందిన సాంప్రదాయ వైద్య జ్ఞానానికి అమూల్యమైన భాండాగారంలాంటివని చర్మవ్యాధుల నుంచి మధుమేహం వరకు వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి కోయా గిరిజనులు ఉపయోగించే 96కి పైగా ఔషధ వృక్ష జాతులను ఈ అడవులు నిలయంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు .

ఆదివాసీ విశ్వాసంలో “ అడవి నాశనం అయితే దేవతలు కోపిస్తారు ” అనే భావన ఉంది. ఈ నేపథ్యంలో, ప్లాస్టిక్‌ వంటి సహజ విరుద్ధ పదార్థాలు మేడారం పరిసరాల్లోకి రావడం ఒక అసహజ పరిణామంగా ఆదివాసీ పెద్దలు భావిస్తారు. సమ్మక్క–సారలమ్మ దేవతలు అరణ్యాల్లో నివసించే వనదేవతలు. వారి గద్దెలు కూడా అటవీ మధ్యనే ఉన్నాయి. జంపన్న వాగు, వెదురు అడవులు, మహువా (ఇప్ప) చెట్లు, సహజ నేల — ఇవే మేడారం ఆలయ నిర్మాణ శిల్పాలు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈసారి మేడారం జాతరను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించాలన్న పిలుపు సహజంగానే రూపుదిద్దుకుంటోంది. దేవతల స్వరూపం–ప్రకృతి మధ్య ఉన్న అంతర్గత సంబంధమే ఈ మేడారం జాతరని, ఇటువంటి విలువైన మేడారం ప్రకృతిని కపడుకోవాల్సిన అవసరం ఉందని పంచాయతీ రాజ్‌, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రజలకు పిలుపునిచ్చారు.

Share this post
Exit mobile version