Site icon MANATELANGANAA

వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్‌లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్

వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్‌లో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్

వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ అధ్యక్షతన బుధవారం కోర్టు హాల్ లో జరిగిన వరంగల్ బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మహిళా న్యాయవాదులకు 30 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఐదు పదవులను మహిళలకు కేటాయించినట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ కమిటీ తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్య సభ ముందుకు తీసుకువచ్చారు. సభ్యుల చర్చల అనంతరం సర్వత్రిక సభ  పలు తీర్మానాలను ఆమోదించింది.

మహిళ న్యాయవాదులకు ఉపాధ్యక్షురాలు, కోశాధికారి పదవులను ఈసారి కొత్తగా ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న సంయుక్త కార్యదర్శి, సీనియర్ కార్యవర్గ సభ్యురాలు, జూనియర్ కార్యవర్గ సభ్యురాలు మొత్తం కలిపి ఐదు పదవులను మహిళలకు కేటాయించినట్లు అధ్యక్షులు వలస సుధీర్ తెలిపారు. మహిళా పదవులతో కలిపి మొత్తం 16 పోస్టులకు వరంగల్ బార్ అసోసియేషన్ ఈ నెల చివరిలో ఎన్నికలు నిర్వహించబడుతాయని తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వలుస సుధీర్ మాట్లాడుతూ మహిళలు బలహీనులు కాదని, వారికి అవకాశం కల్పిస్తే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తారని అన్నారు.
మహిళా న్యాయవాదులకు రిజర్వేషన్లు కల్పించడం పట్ల పలువురు న్యాయవాదులు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దండాపంతుల రమాకాంత్, ఉపాధ్యక్షులు మైదం జయపాల్, సంయుక్త కార్యదర్శులు ముసిపట్ల శ్రీధర్ గౌడ్, రేవూరి శశిరేఖ, క్రీడా సంయుక్త కార్యదర్శి నలిగంటి శివప్రసాద్, కార్యనిర్వాహక సభ్యులు ఇజ్జగిరి సురేష్, కలకోట్ల నిర్మల జ్యోతి, మర్రి రాజు, మడిపెల్లి మహేందర్, తోట అరుణ తదితర కార్యవర్గ సభ్యులు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version