Site icon MANATELANGANAA

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలునిర్వహణ – ప్రముఖులకు పురస్కారాల ప్రదానం


హైదరాబాద్, జూన్ 2, 2025:
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా జరిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి మద్దతిచ్చిన నాయకులు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రాణత్యాగం చేసిన అమర వీరుల సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేశారు.  వివిధ రంగాల్లో కృషి చేసిన మేధావులు, కళాకారులు, యువత, మహిళలకు రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు ప్రదానం చేశారు.


“తెలంగాణ ఉద్యమంలో  విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కవులు – అందరి త్యాగాలతోనే ఈ రోజు సాధ్యమైంది,” అని ముఖ్యమంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, గత 6 నెలల పాలనలో తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర పునర్నిర్మాణ దిశలో అడుగుల గురించి వివరించారు.
డిసెంబరు 7, 2023న ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల ఆకాంక్షలే దిశానిర్దేశం చేశాయని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ధ్వంసమైన వ్యవస్థలను పునఃప్రారంభించడంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా కోటి స్త్రీలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యాన్ని ప్రతిపాదించారు. సున్నా వడ్డీతో రూ.21,000 కోట్ల రుణాల పంపిణీ, మహిళా క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, పాఠశాల నిర్వహణ వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.


రైతుల సంక్షేమం – ప్రధాన ధ్యేయం
రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన కీలక చర్యల గురించి మాట్లాడిన సీఎం, రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిందని, 25 లక్షలకుపైగా రైతులకు రూ.20,617 కోట్ల రుణ మాఫీ లబ్ధి చేకూరిందని తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్, మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్, 8 వేలకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వంటి విషయాలను వివరించారు.
యువత కోసం ఉద్యోగ భద్రత
16 నెలల పాలనలో 60,000 పైగా ఉద్యోగాల భర్తీ చేసినట్టు చెప్పారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, ప్రైవేట్ రంగంలో లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన వివరాలను వెల్లడించారు. సివిల్స్ అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు తదితర అంశాలు యువత భవిష్యత్తుపై ప్రభుత్వ నిబద్ధతను చాటాయి.
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక చర్యలు
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, గౌరవవంతమైన గురుకుల విద్యా విధానం, ప్రీ-స్కూల్ విధానం ప్రవేశపెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి రూ.2,700 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించడాన్ని ముఖ్యాంశంగా చెప్పారు.
భవిష్యత్తు దృష్టితో తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే దిశగా ముందుకెళ్తున్నట్టు ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, మహా మेट్రో విస్తరణ, రిజనల్ రింగ్ రోడ్, విమానాశ్రయాల అభివృద్ధి వంటి ప్రాజెక్టులు అభివృద్ధి దిశగా ముందడుగులు అని వివరించారు.
అంతర్జాతీయ గుర్తింపు
భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు తెలంగాణ ప్రతిష్ఠను పెంచాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి దుబాయ్‌లో అంతర్జాతీయ అవార్డు లభించడం గర్వకారణంగా భావించారు.
ముఖ్యమంత్రి ప్రసంగం చివర్లో, “తెలంగాణ రైజింగ్” అనే సంకల్పముతో రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోనే కాక, ప్రపంచంలోనూ నెంబర్ వన్ గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వ్యక్తం చేశారు.
“ప్రజా ప్రభుత్వాన్ని నమ్మిన ప్రజల అండతోనే మన ప్రయాణం ముందుకు సాగుతుంది. పారదర్శక పాలనతో తెలంగాణకు దారి చూపుతాం,” అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు.
వేడుకల అనంతరం రాష్ట్రస్థాయి పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించగా, సాహిత్యం, కళ, సేవా రంగాల్లో కృషి చేసిన పలువురు ప్రముఖులు అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్బంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ, కొత్త తెలంగాణ నిర్మాణం కోసం ప్రజల భాగస్వామ్యమే అసలైన శక్తి అని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.


తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి  కోటి రూపాయల నగదు పురస్కారం అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

తెలంగాణ ఉద్యమం లో ప్రజల గుండెల్లో నిలిచిన  కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి  విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నగదు పురస్కారం అందించారు.

ఎక్కా యాదగిరి రావు,
అందెశ్రీ,  సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి కి పురస్కారాన్ని అందించిన ముఖ్యమంత్రి

దివంగత గూడ అంజయ్య,
గద్దర్,
బండి యాదగిరి నగదు పురస్కారాన్ని అందుకున్న వారి  కుటుంబ సభ్యులు.

విదేశీ  పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన 19 మంది పోలీస్ అధికారులకు మెడల్ ఫర్ గ్యాలంట్రీ ,11 మంది కి మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు లను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

బహు బాషా సాహితీ వేత్త  నలిమెల భాస్కర్ కు కాళోజీ పురస్కారం అందించిన ముఖ్యమంత్రి

Share this post
Exit mobile version