జంపన్న వాగులో మునిగిపోతున్న ముగ్గురు భక్తులను సకాలంలో కాపాడిన బృందం **
మేడారం,ములుగు:
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా జంపన్న వాగు వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం) 5వ బెటాలియన్ సిబ్బంది సాహసోపేతంగా స్పందించి ముగ్గురు భక్తుల ప్రాణాలను కాపాడారు.
జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భూపాలపల్లి జిల్లా వాసులు మేకల జంపయ్య (36), మేకల సరిత (14), మేకల శిరీష (13) అకస్మాత్తుగా నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి నీటిలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
విధుల్లో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుళ్లు రాందాస్, ప్రవీణ్, రాజశేఖర్, రవి, రాజు, హరీష్ సమన్వయంతో పనిచేసి మునిగిపోతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
రక్షించబడిన వారి కుటుంబ సభ్యులు ఎస్డీఆర్ఎఫ్ రక్షణ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ 5వ బెటాలియన్ కమాండెంట్ కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, మేడారం జాతర వంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తుల భద్రతే తమ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ప్రజలకు సహాయం అందించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భక్తులను కాపాడిన సిబ్బందిని కమాండెంట్ అభినందించారు.
మేడారం జాతరలో ఎస్డీఆర్ఎఫ్ 5వ బెటాలియన్ సిబ్బంది అందిస్తున్న సేవలు భక్తులు, ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

