మేడారం: ప్రపంచ ప్రఖ్యాత గిరిజన జాతర మేడారంపై సమగ్ర సమాచారంతో రూపొందించిన ‘సమ్మక్క – ది గ్లోరీ ఆఫ్ మేడారం’ పుస్తకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం మేడారంలో ఆవిష్కరించారు.
ఈ పుస్తకాన్ని వరంగల్ పూర్వ జిల్లా పౌర సంబంధాల అధికారి, ప్రస్తుత సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించి వెలువరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, మేడారం వడ్డే పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్, డీపీఆర్ఓ రఫీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం జాతర విశిష్టతను కళ్లకు కట్టినట్లుగా వివరించిన ఈ పుస్తకం విలువైన డాక్యుమెంటేషన్గా నిలుస్తుందని అన్నారు. సమ్మక్క–సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ, ఈ గొప్ప వారసత్వాన్ని గ్రంథరూపంలో అందించిన రచయిత వెంకటరమణను మంత్రి అభినందించారు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు హాజరవుతారని, చిన్న అటవీ గ్రామంలో జరిగే ఈ మహాజాతరను ‘గిరిజన కుంభమేళా’గా అభివర్ణిస్తారని పుస్తకంలో వివరించారు. మతాలు, ప్రాంతాలు వేరైనా భక్తులందరినీ ఒక్కచోట చేర్చే విశిష్టత మేడారానిదని, తిరుమల, శబరిమల, కుంభమేళా వంటి అనుభూతులు ఇక్కడ ఒకేచోట కనిపిస్తాయని రచయిత పేర్కొన్నారు.
1994 నుంచి మేడారం జాతరను సమీపంగా చూసిన అనుభవంతో, గిరిజన సంప్రదాయాలు, మొక్కులు, జాతర నిర్వహణ, మీడియా పాత్ర, పరిపాలనా సవాళ్లు వంటి అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు వెంకటరమణ తెలిపారు. ఇప్పటివరకు మేడారం పై తాను రాసిన వ్యాసాల సంకలనంగా ఈ గ్రంథాన్ని ప్రచురించినట్లు చెప్పారు.
మేడారం జాతర వైభవాన్ని, ఆధ్యాత్మికతను, గిరిజనుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ఈ పుస్తకం పరిశోధకులు, మీడియా ప్రతినిధులు, భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
కన్నెకంటి వెంకటరమణ
ఇంతటి, గొప్ప జాతర నిర్వహణలో భాగస్వామ్యం కావడం గొప్ప అవకాశం. సమాచార పౌర సంబంధాలశాఖలో 1993 లో APPSC ద్వారా సహాయ పౌర సంబంధాల అధికారిగా వరంగల్ లో జాయిన్ అయ్యాను. అప్పటినుండి, మొట్ట మొదటి సరిగా 1994 నుండి మేడారం జాతర విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాను. 2014 వరకు ప్రతీ జాతరకు ములుగు డివిజనల్ పీఆర్ఓ గా, వరంగల్ డీపీఆర్ఓ గా మేడారంలో మీడియా సెంటర్ ఇంఛార్జిగా భాద్యతలు నిర్వర్తించాను. పదోన్నతిపై హైదరాబాద్ కు వెళ్లినప్పటికీ ప్రతీ జాతరకు తప్పనిసరిగా వెళ్తూ అక్కడి జాతరలో గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలు, మొక్కులు, జాతర జరిగే తీరు, వివిధ రాష్ట్రాలనుండి వచ్చే గిరిజన జాతుల సంస్కృతీ సాంప్రదాయాలు, మీడియా కవరేజి, జాతరలో ఎదురయ్యే ఇబ్బందులు… ఇలా భిన్న అంశాలపై ఈ పుస్తకం ముద్రించడం జరిగింది. ఇప్పటివరకు మేడారం పై రాసిన వ్యాసాల సంకలనాన్ని *సమ్మక్క – The Glory of MEDARAM * అనే పేరుతొ ప్రచురించడం జరిగింది. పుస్తకం కావాల్సిన వారు: 9849905900 , 9490396828 కన్నెకంటి వెంకట రమణ జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ

