Site icon MANATELANGANAA

రోహిణి కార్తె అంటేనే రోళ్లు పగిలే ఎండలు

రోహిణి కార్తె అంటేనే రోళ్లు పగిలే ఎండలని భయపడుతుంటారు. నిజమే వేసవి కాలం ఆఖరులో వచ్చే ఎండలు దంచి కొడుతాయి.

ఈయేడు మే 25 నుంచి జూన్ 8 వరకు రోహిణి కార్తె కొనసాగనుంది. వేసవిలో అత్యధిక ఎండలు నమోదయ్యే కాలంగా రోహిణి కార్తెకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. “రోహిణి కార్తెలో రోకండ్లు పగిలే ఎండలు” అనే నానుడి కూడా ప్రజల్లో వినిపిస్తూ ఉంటుంది.

ఉగాది తర్వాత నుంచి క్రమంగా పెరుగుతున్న ఎండలు రోహిణి కార్తె సమయానికి మరింత తీవ్రంగా మారుతాయి. ఈ సమయంలో వేడి గాలులు, ఉక్కపోత, అగ్ని ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ పరిస్థితులను పరిశీలించే వారు చెబుతున్నారు.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మట్టికుండ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పండ్ల రసాలు, రాగి జావ వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మసాలా ఆహారం, ఎక్కువ నూనెతో తయారైన వంటకాలు తగ్గించాలని చెబుతున్నారు.

నీటి సౌకర్యం ఉన్నవారు రోజుకు రెండు పూటలా స్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తెలుపు లేదా లేత రంగుల కాటన్ దుస్తులు ధరించడం వల్ల వేడి నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

పశువులు, పక్షులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని ప్రజలను కోరుతున్నారు. అలాగే దాహంతో ఉన్న బాటసారులకు చల్లటి నీరు అందించడం మంచిదని పెద్దలు సూచిస్తున్నారు.

ఈ ఏడాది మే నెలలో సాధారణంగా ఉండే తీవ్ర ఎండల కంటే కొంత ఉపశమనం లభించింది. నెలలో పలుచోట్ల వర్షాలు కురవడంతో ప్రజలకు ఊరట లభించినా, రైతులకు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యాయి. అకాల వర్షాల కారణంగా పంటలపై ప్రభావం పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Share this post
Exit mobile version