Site icon MANATELANGANAA

రోడ్డు ప్రమాద భాదితులను ఆదుకునే పీఎం-రాహత్ ప్రారంభం

pm modi gift

ప్రధాన మంత్రి నూతన కార్యాలయ భవనం “సేవా తీర్థ్”ను శుక్రవారం ప్రధాని Narendra Modi ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో తొలి రోజునే ఆయన పలు ముఖ్య నిర్ణయాలు ప్రకటించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసాయం అందించేందుకు “పీఎం-రాహత్” అనే కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ఈ సమయంలో చికిత్స అందితే ప్రాణాపాయం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిధుల కొరత కారణంగా వైద్యం ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది.

పీఎం-రాహత్ పథకం కింద ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు తక్షణ వైద్య సాయం అందించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రులు చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. అవసరమైన సౌకర్యాలు లేని పక్షంలో, ఆసుపత్రి యాజమాన్యం బాధితుడిని అంబులెన్స్ ద్వారా మరొక ఆసుపత్రికి తరలించాలి. చికిత్స పూర్తై డిశ్చార్జ్ అయిన తర్వాత సంబంధిత ప్యాకేజీ ప్రకారం బిల్లులను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇదే సందర్భంగా గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అమలు చేస్తున్న “లఖ్‌పతీ దీదీ” పథకాన్ని మరింత విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. గ్రామీణ మహిళలు సంవత్సరానికి సగటున రూ.1 లక్ష ఆదాయం పొందేలా ఈ పథకాన్ని రూపొందించారు. వివిధ రంగాల్లో శిక్షణ అందిస్తూ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.

ఈ పథకం కింద ఇప్పటికే సుమారు మూడు కోట్ల మంది మహిళలు తమ కుటుంబ వార్షిక ఆదాయాన్ని రూ.లక్షకు పెంచుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిర్దేశిత గడువు కంటే ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్న నేపథ్యంలో, 2029 మార్చి నాటికి లఖ్‌పతీ దీదీల సంఖ్యను తొమ్మిది కోట్లకు చేర్చాలని ప్రధాని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశారు.

Share this post
Exit mobile version