పశ్చిమాసియా దేశాల యుద్ద నేపద్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోది సామాన్యులకు ఉపశమనం కలిగించే శుభవార్తను వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశంలో పెట్రోల్, గ్యాస్ సరఫరాలపై ఎలాంటి కొరత ఉండదని ప్రధాన మంత్రి భరోసా ఇచ్చారు.
మంగళవారం పార్లమెంట్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు భారతదేశంపై ప్రభావం చూపుతున్నప్పటికీ, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యంగా రైతులు, సాధారణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రలమెంట్ లో ఆయన స్పష్టం చేశారు.
దేశంలో చమురు, వంటగ్యాస్ సరఫరాలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ఎరువుల సరఫరా సజావుగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు మంత్రులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేకుండా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వ్యూహాత్మకంగా 5.3 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోలియం నిల్వలు దేశానికి భద్రత కల్పిస్తున్నాయని వివరించారు.
పశ్చిమ ఆసియాతో ఉన్న సంబంధాలు భారతదేశానికి అత్యంత కీలకమని ప్రధాని గుర్తు చేశారు. ముఖ్యంగా ఎరువుల దిగుమతుల విషయంలో ఆ ప్రాంతంపై ఆధారపడుతున్న నేపథ్యంలో, సరఫరా అంతరాయం కలగకుండా ఇరాన్తో సమతుల్య సంబంధాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా నౌకల నిర్మాణానికి రూ. 70,000 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రధాని వెల్లడించారు. దీని ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను మరింత సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మూడువారాలకు పైగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోందని, భారతదేశానికి కూడా ఇది సవాళ్లను విసిరిందని ప్రధాని తెలిపారు. ఈ సవాళ్లు కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాకుండా, జాతీయ భద్రత, మానవతా కోణాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

