Site icon MANATELANGANAA

అసెంబ్లీ వేదికగా వరంగల్ విద్యా–వైద్య సమస్యలపై ఎమ్మెల్యే నాయిని ప్రస్తావన

అసెంబ్లీ వేదికగా వరంగల్ విద్యా–వైద్య సమస్యలపై ఎమ్మెల్యే నాయిని ప్రస్తావన

హైదరాబాద్:
వరంగల్ నగరంలోని విద్యా, వైద్య రంగాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కోరారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు.

రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణకు వైద్యరంగంలో ప్రధాన ఆధారమని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఇటీవల సిటీ స్కానింగ్ పరికరం పనిచేయకపోవడంతో సుమారు 30 మంది రోగులను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాల్సి వచ్చిందని, అధికారులతో చర్చించి తాత్కాలికంగా సమస్య పరిష్కరించినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి సభ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అయితే పూర్తి పట్టణ పరిధి కలిగిన హనుమకొండలో పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలు లేవని, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని స్థలంలో పాఠశాల ఏర్పాటు చేసేందుకు స్థానికంగా అందరూ సిద్ధంగా ఉన్నారని వివరించారు. అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు తెలుపుతున్నప్పటికీ, కొన్ని రాజకీయ విద్యార్థి సంఘాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో అమలు కాని హామీలు ఇచ్చినవారే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.

పాఠశాల ఏర్పాటు వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పేర్కొన్న ఎమ్మెల్యే నాయిని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అవసరమైన సహకారం అందించాలని కోరారు.

అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో అపార్ట్‌మెంట్ వాసులకు అమలు చేస్తున్న 90 శాతం పన్ను రాయితీని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

Share this post
Exit mobile version