మిస్ వరల్డ్ ఫ్యాషన్ ఫినాలేలో తలుక్కుమన్న కు తెలంగాణ డిజైన్లు
పోచంపల్లి, గద్వాల, గొల్ల భామ చేనేత చీరలతో ర్యాంపు వాక్
వందకుపైగా దేశాల భామలతో తెలంగాణ డిజైన్లకు ప్రపంచఖ్యాతి
మిస్ వరల్డ్ వేదికపై మరోసారి తెలంగాణ సంసృతీ, సంప్రదాయాలు తళుక్కున మెరిసాయి. ఇవాళ జరిగిన వరల్డ్ ఫ్యాషన్ ఫినాలే షోలో పోటీదారులు అందరూ తెలంగాణకు ప్రత్యేకమైన పోచంపల్లి, గద్వాల్ చీరలు ధరించి ర్యాంపుపై వాక్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన పోచంపల్లి హ్యాండ్లూమ్ వస్త్రాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు మెరిశారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు చీరకట్టులో సంప్రదాయబద్దంగా కనిపించారు. అమెరికా కరె్బియన్ దేశాలకు చెందిన సుందరీమణులు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ తో ఆకట్టుకున్నారు. ఇక యూరోప్ ఖండానికి చెందిన దేశాల ప్రతినిధులు గొల్ల భామల చేనేత చీరలతో మెప్పించారు.
యూనెస్కో గుర్తింపు పొందిన గొల్ల భామల చేనేత వస్త్రాలతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా యూరోపియన్ దేశాల కంటెస్టెంట్లు మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో రాంప్ వాక్ చేశారు. ఇక మిస్ ఇండియా నందిని గుప్తా ఎరుపు రంగు పటోలా లెహంగాలో తళుక్కు మన్నారు.
తెలంగాణ చేనేత వస్త్రాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్ అర్చనా కొచ్చారు అన్నారు. దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి దక్కుతుందని తెలిపారు.
ఫ్యాషన్ ఫినాలేకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహుతులు తెలంగాణ సంప్రదాయ బద్దమైన డిజైన్లను చూసి ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుందరీమణులు స్థానిక చేనేతలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించటం ఆ డిజైన్లకు, తయారీదారులకు మంచి గుర్తింపును, మార్కెటింగ్ అవకాశాన్ని ఇస్తుందని అన్నారు.
తెలంగాణ చేనేత వస్త్రాల ధారణతో ర్యాంపుపై సందడి చేసిన అనంతరం, ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఆధునిక ఫ్యాషన్ డ్రెస్ లతో ర్యాంపుపై మిస్ వరల్డ్ కంటెస్టంట్లు వాక్ చేశారు.