Site icon MANATELANGANAA

తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా

మా ప్రతి అడుగు ప్రజల కోసమే…
యూఎస్ కాన్సులేట్ సందర్శకులకు తప్పనున్న తిప్పలు
రూ.1.5 కోట్లతో ‘తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా’
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మా ప్రభుత్వం వేసే ప్రతి అడుగు తెలంగాణ ప్రజల కోసమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

గురువారం హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రాంగణంలో రూ.1.5 కోట్లతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్(టీజీఐఐసీ) అత్యాధునిక వసతులతో నిర్మించిన ‘తెలంగాణ స్టేట్ కాన్సులర్ వెయిటింగ్ ఏరియా’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ‘హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్‌కు ప్రతిరోజూ 3వేల మందికి పైగా సందర్శకులు వస్తుంటారు. వేచి చూసేందుకు సరైన సౌకర్యాలు లేక ఇక్కడికొచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మా దృష్టికొచ్చింది. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఎక్కడెక్కడె ఏం అవసరమో గుర్తించి… అందుకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో కూడిన వెయింటింగ్ ఏరియాను అందుబాటులోకి తీసుకొచ్చాం. కేవలం పారిశ్రామిక, సాంకేతిక రంగాలకే పరిమితం కాకుండా, ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు ఇది నిదర్శనం’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘తెలంగాణ – అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగాల్లో అమెరికా మన రాష్ట్రానికి అగ్రగామి వ్యాపార భాగస్వామి. మన ఐటీ ఎగుమతుల్లో 38 శాతం ఉత్తర అమెరికాకు జరుగుతున్నాయి. గూగుల్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా ఉంది. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే అమెరికా కంపెనీలు మన రాష్ట్రంలో రూ.31,500 కోట్ల పెట్టుబడులను పెట్టాయి. ఫలితంగా 30వేల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి’ అని చెప్పారు. ఈ కొత్త వెయిటింగ్ ఏరియా ద్వారా అంతర్జాతీయ భాగస్వామ్యాలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేసేందుకు కూడా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ తదితరులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version