Site icon MANATELANGANAA

మేడారం మహాజాతర ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్షా సమావేశం

మేడారం మహాజాతర ఏర్పాట్లపై బుధవారం

సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సబ్యసాచి ఘోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

జాతర కోసం గిరిజన సంక్షేమ శాఖ రూ.150 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ.90 కోట్లు సివిల్ వర్క్స్‌కి, రూ.60 కోట్లు నాన్ సివిల్ వర్క్స్‌కి కేటాయించినట్లు తెలిపారు. సివిల్ వర్క్స్ ప్రగతి, నాన్ సివిల్ వర్క్స్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీ సబ్యసాచి ఘోష్ ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర్‌తో కలిసి మాట్లాడుతూ —
మేడారం జాతర ఏర్పాట్లను 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించారని తెలిపారు. జోన్–3 ను జంపన్న వాగు ప్రాంతంగా నిర్ణయించారు. జాతర సమయంలో 10 నుండి 12 వేల మంది పోలీసు సిబ్బంది భద్రతా బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. ప్రతి జోన్‌కు ఒక జోనల్ ఆఫీసర్ను నియమించనున్నట్లు తెలిపారు.

అదనంగా, 24 శాశ్వత టవర్స్, 20 సెల్-ఆన్-వీల్స్, 350 వై-ఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

జాతర ప్రాంతంలో 49 పార్కింగ్ ప్రదేశాలను (మొత్తం 1050 ఎకరాలు) గుర్తించారని, వీటిలో 4.5 నుండి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ ఏర్పాట్లు నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో 24+9 ఫారెస్ట్ రోడ్లు కచ్చా నుండి డబుల్ లేన్‌గా అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో వైల్డ్‌లైఫ్ శాంక్చువరీలోని రహదారులు కూడా చేర్చబడ్డాయి. ఆర్ & బీ శాఖ ద్వారా రూ.42 కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు, రూ.92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మిస్తున్నట్లు వివరించారు.

జాతర సమయానికి ముందు, మధ్య, తరువాత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన నేపథ్యంలో మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 517 బోరుపాయింట్లు, 250 కిలోమీటర్ల రహదారులపై లైటింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

స్థానికుల సహకారంతో 6 స్లాటర్ సెంటర్లు ఏర్పాటు చేయగా, జంపన్న వాగు పునరుద్ధరణ పనులు సాగుతున్నాయని ఇరిగేషన్ శాఖ అధికారులు వివరించారు.

విద్యుత్ శాఖ 9,111 విద్యుత్ స్తంభాలు, 259 ట్రాన్స్ఫార్మర్లు అమర్చే పనులు చేపడుతోంది. ఎండోవ్మెంట్స్ శాఖ ఆధ్వర్యంలో జాతర ప్రాంతమంతా ప్రకాశ ఏర్పాట్లు (ఇల్యూమినేషన్) చేయనున్నారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని శ్రీ సబ్యసాచి ఘోష్ ఆదేశించారు.

సమావేశంలో లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ శ్రీ మహేష్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ములుగు ఎస్పీ, విద్యుత్ శాఖ CMD శ్రీ వరుణ్ రెడ్డి, మరియు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share this post
Exit mobile version