అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటా
త్యాగధనుల కళ్లలో నీళ్లు రానివ్వను
పీడిత ప్రజల విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబ సభ్యుల కళ్లలో నీళ్లు రానివ్వనని, అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటానని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న అన్నారు. కామ్రేడ్ మారోజు వీరన్న 27 వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన అమరవీరుల కుటుంబాలతో కలిసి సూర్యపేట జిల్లా కర్విరాల కొత్తగూడెంలో మారోజు వీరన్న స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గట్ల రాజయ్య, గిరగాని బిక్షపతి, న్యాయవాదులు జన్ను పద్మ, కర్రు పావని తదితరులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బ్రాహ్మణీయ ఆధిపత్య దోపిడీ కులాలు చేసిన దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా తెలంగాణతో పాటు దేశంలో ఎన్నో వీరోచిత పోరాటాలు జరిగాయని ఆ పోరాటాల్లో వేలాదిగా యుద్ధ వీరులు అమరులయ్యారని, ఆ అమవీరుల కుటుంబాల బతుకు దుర్భరంగా మారిందని అలాంటి అమవీరుల కుటుంబ సభ్యులను గుర్తించి వారి జీవితాలను బాగు పరిచే కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుందని అన్నారు. చమట చుక్కలు, కన్నీటి చుక్కలు, నెత్తురు చుక్కల చరిత్రలో మెజార్టీ అణగారిన ప్రజలు ఉన్నారని, అలాంటి సమాజాన్ని ఐక్యం చేసి కన్నీటి చుక్కలు లేని సమాజాన్ని, నెత్తురు చిమ్మని రాజ్యాన్ని నిర్మిస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి ఆర్ పి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కులం భారతదేశంలో ఉందని, వేల ఏండ్లుగా ఈ కులాలను అడ్డు పెట్టుకొని పాలకులు దోపిడీ పాలన కొనసాగిస్తున్నారు. కులం నిర్మూలన కాకుండా వర్గం నిర్మూలన కాదని బోధించి పోరాటం మార్గం చూపించిన మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్, సాహు మహారాజ్, బాబా సాహెబ్ అంబేద్కర్ కాన్షీరాంల సిద్ధాంత పునాదితో, మార్క్స్ చూపించిన వర్గ నిర్మూలన సిద్ధాంతాని జమిలిగా కుల, వర్గ నిర్మూలన కోసం వీరోచిత పోరాటం చేసిన కామ్రేడ్ మారోజు వీరన్నను 27 ఏండ్ల క్రితం ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ లో చంపిందని అన్నారు. వీరన్న అమరుడైన ఆయన చూపిన ఉద్యమ బాట నేటికి అణగారిన ప్రజల్లో సజీవంగా ఉందని, స్వాతంత్ర పోరాటం మొదలుకొని తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన అన్ని పోరాటాల్లో త్యాగాలు సామాన్య ప్రజలవని, భోగాలు దోపిడీ కులాలవని ఆస్థితిని మార్చాల్సిన అవసరముందని అన్నారు. మారోజు వీరన్న కలలుకన్న రాజ్య నిర్మాణం కోసం తెలంగాణలో తీన్మార్ మల్లన్న కంకణం కట్టుకున్నాడని, సామాన్యుడు చట్టసభల్లో ఉన్నపుడే సమానత్వం వస్తుందని మల్లన్న చేస్తున్న రాజకీయ యుద్ధంలో రాష్ట్రంలోని అణగారిన ప్రజలు చేరాలని పిలుపునిచ్చారు. ఇంతవరకు ఉత్పత్తి శక్తిగా ఉన్న బి.సి సమాజం బతుకలేక బలిదానాలు చేసుకుంటున్నారని, బి.సి సమాజం బ్రతకాలంటే బి.సి లు మల్లన్న నాయకత్వంలో రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నారు.

