వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్
సావిత్రిబాయి పూలే కు వరంగల్ బార్ ఘన నివాళులు
రెండు వందల ఏండ్ల క్రితమే మహిళా అభ్యున్నతికి విద్య నేర్పడంతో పాటు, సామాజిక రుగ్మతలను రూపుమాపి అవనిలో సగమైన మహిళా సమాజం గౌరవంగా బ్రతకడం కోసం మాతా సావిత్రిబాయి పూలే చేసిన త్యాగపూరిత పోరాట స్పూర్తితో మహిళా న్యాయవాదులతో పాటు మహిళా సమాజం అన్నిటిలో సగభాగం వాటా సాధించాలని వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలస సుధీర్ అన్నారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలో వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల సంయుక్త కార్యదర్శులు రేవూరి శశిరేఖ, రేణిగుంట నాగేంద్రల అధ్యక్షతన సావిత్రిబాయి పూలే హాల్ లో మంగళవారం జరిగిన సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు.
ఆధిపత్య వర్గాల అఘాయిత్యాలు కొనసాగుతున్న 200 ఏండ్ల క్రితమే మహిళా అభ్యున్నతికి కృషి చేసిన పూలే దంపతులను స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళా అభివృద్ధికి ఎన్నో హక్కులను కల్పించాడని ఆ హక్కుల ద్వారా మరింత చైతన్యమై ఐక్యతతో న్యాయ వ్యవస్థలో మహిళలు రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.
వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ మహిళా సంయుక్త కార్యదర్శులు రేవూరి శశిరేఖ, రేణిగుంట నాగేంద్ర మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మొదలుకొని ఎందరో త్యాగపలంగా మహిళలకు విద్యతో పాటు ఎన్నో హక్కులు కల్పించబడ్డాయని, అయినా కూడా ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదని, ఆయా పదవుల్లో మహిళలకు దక్కాల్సిన వాటా దక్కకపోవడం బాధాకరమని అన్నారు. బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ లలో వాటా సాధించినట్లే ప్రభుత్వం నియమించే జి.పి, ఎజిపి, పి.పి తదితర టెన్యూర్ పదవుల్లో మహిళా వాటా కోసం ఐక్యంగా పోరాడి సాధించుకున్నపుడే సావిత్రిబాయికి నిజమైన నివాళి అర్పించనట్లవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ మహిళా న్యాయవాదులు ఐక్యంగా పోరాడి న్యాయవాద రక్షణ చట్టం, అడ్వకేట్ అకాడమీ సాధించుకోవాలని, న్యాయవాద వృత్తిలో నమోదు చేసుకున్న మహిళ న్యాయవాదులకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ స్టైఫండ్ ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు మైదం జయపాల్, నలిగంటి శివప్రసాద్, కె నిర్మలా జ్యోతి, మహేందర్, తోట అరుణ, కొక్కొండ రమేష్, ఐ ఎల్ పి ఎ నాయకులు సాయిని నరేందర్, విలాసాగరం సురేందర్ గౌడ్, జన్ను పద్మ, న్యాయవాదులు గోపిక రాణి, పద్మలత గౌడ్, జలజ, సిరిమల్ల అరుణ, లలిత కుమారి, రత్న మంజుల, శ్రీలత, గంధం శివ, ఐత ప్రసాద్, నాగేంద్రచారి, నరసింగరావు, పద్మ యాదవ్, సరిత, సుకన్య, దీప, వీణ, జయశ్రీ, శృతి, ప్రవీణ, అనిత, సౌందర్య, అంజలి, కవిత తదితరులు పాల్గొని సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

