వరంగల్, ఫిబ్రవరి 6, 2026:
కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW) లోని జాతీయ సేవా పథకం (NSS) విభాగం, మైభారత్ వరంగల్ సహకారంతో అంతర్రాష్ట్ర యువజన ఐక్య సమ్మేళనం, సాంస్కృతిక ఉత్సవం జరిగింది.
భారత ప్రభుత్వం – యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేరళ రాష్ట్రానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హాజరై, జాతీయ ఐక్యత, సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహన లక్ష్యంగా ఈ సమ్మేళనం సాగింది.
కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. స్వర్ణలత దీప ప్రజ్వలనతో ప్రారంభించారు.
ఆమె మాట్లాడుతూ, ఈ అంతర్రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంతపు చారిత్రక వైభవం, సాంస్కృతిక గొప్పతనాన్ని చాటిచెప్పే వేదికగా నిలిచిందన్నారు. భారతదేశపు అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ ప్రాచీన ఆత్మను తెలుసుకునే అవకాశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, పరస్పర చర్చలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించబడగా, ఏకత్వంలో వైవిధ్యం అనే భావన స్పష్టంగా ప్రతిబింబించింది. తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ ప్రొఫెసర్ కె. శ్రీధర్ మాట్లాడుతూ, కిట్స్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (SAC) ఆధ్వర్యంలోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమం యువతలో నాయకత్వ లక్షణాలు, సమన్వయం, సాంస్కృతిక అవగాహన పెంపొందించిందన్నారు.
ఈ కార్యక్రమంలో మైభారత్ వరంగల్ డిప్యూటీ డైరెక్టర్ చి. అన్వేష్, శ్రీ దేవీలాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. సతీష్ చంద్ర, కళాశాల డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, పీఆర్వో డా. డి. ప్రభాకర చారి పాల్గొన్నారు.
కేరళ రాష్ట్రానికి చెందిన నందన, ఆనంద్, విద్యార్థి ప్రతినిధులు శ్రీజని,వాత్సల్య, శ్రేష్ఠ, ఎన్. సంహిత,శ్రీలాస్య, సాయిసుమంత్, శౌర్యన్, సాయిదనుష్, అలాగే 200 మందికి పైగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు 100 మందికి పైగా కేరళ యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

