గిరిజన సంక్షేమ శాఖలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి, డా. ధనసరి అనసూయ సీతక్క సన్మానం
గురుకులాలు, EMRS పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్, పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క గారిచే సన్మానం చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాలలో గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు 84.94% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ లో గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల దేవరకొండలో చదివిన కుమారి కేతావత్ అఖిల 1000 మార్కులకు గాను 996 మార్కులు సాధించి బైపీసీ లో రాష్ట్రంలో రెండవ ర్యాంకు లో నిలిచారు.
కుమారి కేతావత్ స్రవంతి గురుకుల కళాశాల పరిగి నుండి 1000 మార్కులకు 994 మార్కులు సాధించి ఎంపి MPC లో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు లో నిలిచారు. పాడియా మౌనిక గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల కేసముద్రం నుండి 1000 మార్కులకు 980 మార్కులు సంపాదించి CEC లో రాష్ట్రంలో ఎనిమిదో ర్యాంకును సాధించారు.
మొత్తం మీద గిరిజన విద్యార్థిలు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం నందు 28 మంది రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 71 మంది రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. EMRS విద్యార్థులు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో 89.51 శాతం ఉత్తీర్ణత సాధించటం జరిగింది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులు 900 కి పైగా మార్కులు సాధించిన వారు 1,224 మంది ఉన్నారు.
SSC ఫలితాలలో గిరిజన గురుకుల విద్యార్థులు 98.08% విజయం సాధించారు. ఇది రాష్ట్ర సగటు కంటే 6 శాతం ఎక్కువ. 486 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. 41 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి. EMRS సంస్థలో 23 పాఠశాలలకు గాను 22 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు 95% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 141 ఆశ్రమ పాఠశాలలు మరియు 86 ఎస్టి హాస్టల్లు 100% ఫలితాలు సాధించాయి. 160 మంది విద్యార్థులు SSC లో 90 శాతానికి పైగా మార్కులు సాధించారు. రమావత్ మోహన్ 600 లకు 582 మార్కులు మరియు మాడే మౌనిక 600 లకు 575 మార్కులు సాధించారు.
వీరందరినీ మంత్రి, డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు అభినందించి, మెడల్ తో పాటు సర్టిఫికెట్ ఇచ్చి సత్కరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వము గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందిస్తుంది కాబట్టి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని సాధనకై కృషిచేసి మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడి వారి తల్లిదండ్రులకు గురువులకు వారి గ్రామానికి మంచి పేరు తేవాలని తెలియజేశారు. అదేవిధంగా మనము ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అదేవిధంగా మన యొక్క గిరిజన సంస్కృతి, భాష మరియు ఆచార వ్యవహారాలను మరచిపోవద్దని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి, డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే, బెడమ బొజ్జు, GCC చైర్మన్, కోట్నాక్ తిరుపతి , TRICOR చైర్మన్, బెల్లయ్య నాయక్ , గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డాక్టర్ ఏ. శరత్, ఐఏఎస్ , గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి, శ్రీమతి సీతాలక్ష్మి, ఐఏఎస్ , గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి, వి. సర్వేశ్వర్ రెడ్డి, TCRI & TI డైరెక్టర్, డాక్టర్ వి. సముజ్వల , GCC GM, సీతారాం నాయక్ , గురుకుల అదనపు కార్యదర్శి, శ్రీమతి పి. మాధవి దేవి, గురుకుల డిప్యూటీ సెక్రటరీ (అకడమిక్), డి.ఎస్. వెంకన్న మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.