ఇందిరమ్మ ఇంటి లబ్దిదారు
కలలో కూడా అనుకోలేదు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని..
సార్ .. సిఎం గారిని తీసుకొని మీరు రావాలి మా గృహ ప్రవేశానికి
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ముఖాముఖి
లబ్దిదారులే నిర్మాణకర్తలు
ఇప్పటి వరకు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు
హైదరాబాద్ :- “ఇందిరమ్మ ఇల్లు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. 10 -15 సంవత్సరాల నుంచి గుడిసెలు, రేకుల షెడ్డుల్లోనే ఉంటున్నాం. పిల్లలు పెద్ద అవుతున్నారు. సరిపోవడం లేదు. ఉన్నదాంట్లోనే సర్ధుకుంటున్నాం. ఎన్నో ఏండ్ల నుంచి కిరాయి ఇంట్లో ఉంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. స్లాబ్ వేసుకున్నాం. నాలుగు లక్షల రూపాయిలు ఇచ్చారు. కొద్దిరోజుల్లో ఇంటి పనులు పూర్తిచేసుకుంటాం. మా గృహ ప్రవేశానికి సిఎం రేవంత్ రెడ్డి సార్ను తీసుకొని మీరు రావాలి సార్.. మీరు వస్తే జొన్న రొట్టెలు పెడతాం యాటను కూడా కోస్తాం.. రేవంత్ రెడ్డి సార్ మీరందరరూ తినే సన్నబియ్యం మాకు కూడా ఇస్తుండు. ఆ బియ్యంతో భోజనం పెడతాం.” “ఇది రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల మనోగతం”..
సోమవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ఇందిరమ్మ లబ్దిదారులతో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గంటన్నర పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ లబ్దిదారులతో మాట్లాడిన సందర్బంలో లబ్దిదారుల వ్యక్తం చేసిన మనోగతం..
ఖమ్మం జిల్లా- ఉమ
ఇందిరమ్మ ఇల్లు వచ్చింది .. చాలా సంతోషంగా ఉంది. బేస్మెంట్ , గోడలకు ఇప్పటి వరకు రూ.2 లక్షలు ఇచ్చారు. స్లాబ్ కూడా వేశాము. సొంత ఇల్లు ఉండాలన్న మా కోరికను రేవంత్ రెడ్డి సార్ తీర్చారు.
లక్ష్మి- కొడంగల్ బొమ్మరాస్ పేట మండలం నాగిరెడ్డి పల్లి గ్రామం
ఇల్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. రేవంత్ రెడ్డి సార్ ఇల్లిచ్చిండు. మీరు డబ్బులిస్తున్నారు. ఇవాళ కూడా స్లాబ్కు రూ. 2 లక్షలు వచ్చినయ్. రేవంత్రెడ్డి సార్ ను తీసుకొని మీరు గృహ ప్రవేశానికి రావాలి సార్. యాటను కోస్తా , సిఎం సార్ ఇస్తున్న సన్నబియ్యంతో భోజనం పెడ్తా. తప్పకుండా రావాలి సార్
సుభావతి – నిర్మల్ జిల్లా
కలలో కూడా ఇల్లు వస్తుందనుకోలేదు. ఇద్దరు పిల్లలు .ఆడపిల్లను లా చదివిస్తున్నా. మగ పిల్లాడ్ని బిటెక్ చదివిస్తున్నా. గుడిసెలో ఉంటున్నాం. ఆ రేవంత్ రెడ్డి సార్ దేవుడిలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. ఆ ఇంటికి మీరు వచ్చి రిబ్బన్ కట్ చేయాలి.
లబ్దిదారులే నిర్మాణకర్తలు
ఇప్పటి వరకు రూ. 68 కోట్లు దాటిన చెల్లింపులు
పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయని త్వరలో గృహ ప్రవేశాలు కూడా చేసుకుంటారని పేదింటి ఆడపడుచుల ఆహ్వానాన్ని స్వీకరించి వీలైన చోట్ల గృహ ప్రవేశానికి వెళ్తానని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఈనెల 19వ తేదీ నుంచి ఈ వారానికి సంబంధించి లబ్దిదారులకు 14.44 కోట్ల రూపాయిలను ఈ సందర్బంగా విడుదల చేశారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల పధకానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు ఇందులో 7,824 ఇండ్లు బేస్మెంట్,895 ఇండ్లు గోడల నిర్మాణం వరకు మరో 64 ఇండ్లు శ్లాబ్ ల వరకు పూర్తయ్యాయని తెలిపారు.
గత ప్రభుత్వం చేసిన ఆర్ఢిక విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవానికి ఇచ్చిన మాట ప్రకారం తల తాకట్టుపెట్టయినా సరే ప్రతి సోమవారం లబ్దిదారులకు నిధులను విడుదల చేసితీరుతామన్నారు.ఒక్క రోజుకూడా ఇందిరమ్మ లబ్దిదారుడు నిధుల కోసం ఎదురు చూడకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమచేస్తాం
రాష్ట్రంలో ఇంతవరకు బేస్మెంట్ పూర్తి అయిన 5,682 ఇండ్లకు లక్ష చొప్పున రూ. 56.82 కోట్లు, గోడలు పూర్తి అయిన 497 ఇండ్లకు రూ. 2లక్షల చొప్పున రూ. 9.94 కోట్లు, స్లాబు పూర్తయిన 33 ఇండ్లకు 4లక్షల చొప్పున రూ. 1.32 కోట్లు విడుదల చేశామన్నారు. మొత్తంగా ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 68.08 కోట్లు అందజేశామని తెలిపారు
గత సోమవారం మే 19 తేదీనాటికి బేస్మెంట్ పూర్తయిన 5140 ఇండ్లకు రూ. 51.40 కోట్లు అందజేశామని, ఈరోజున 1072 ఇండ్లకు రూ. 10.72 కోట్లు విడుదల చేశామన్నారు. దీంతో ఇంతవరకు బేస్మెంట్ పూర్తయిన 6212 ఇండ్లకు రూ.62.12 కోట్ల రూపాయిలను లబ్దిదారులకు అందజేశామన్నారు.
గోడలు పూర్తయిన ఇండ్లకు సంబంధించి గత సోమవారం వరకు 224 ఇండ్లకు రూ.2.24 కోట్లు విడుదల చేయగా ఈరోజు 306 ఇండ్లకు రూ. 3.06 కోట్లు విడుదల చేశామన్నారు.
స్లాబులు పూర్తయిన 33 ఇండ్లకు ఈ రోజున చ రూ. 0.66 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ ఉంటుందేతప్ప నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదు. లబ్దిదారులు తమ స్ధలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకునే సౌలభ్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ జరుగుతోందని, లబ్దిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనుల్లో తగు సహకారాన్ని అందించాలని, వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్దిదారులను ప్రోత్సహించాలని మంత్రి పొంగులేటి సూచించారు.