Site icon MANATELANGANAA

సి ఎం రేవంత్ రెడ్డికి షాకిచ్చిన గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ

“పేదలను వెలివేసి గాంధీ విగ్రహం కోసం స్థలం సృష్టించడం అత్యంత అగాంధీయ చర్య”

– గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ

మూసీ సుందరీకరణపై వివాదం ముదురుతోంది – పేదల ఇళ్ల కూల్చివేతలపై తుషార్ గాంధీ ఆందోళన

హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు రోజురోజుకు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ప్రాజెక్టు అమలులో భాగంగా పేదల ఇళ్ల కూల్చివేతలు, భూముల స్వాధీనం వంటి అంశాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా బాపూఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారుసి. పేదల ఇళ్లు కూల్చి గాంధీ విగ్రహానికి స్థలం కల్పించడం గాంధేయ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. “పేదలను వెలివేసి గాంధీ విగ్రహం కోసం స్థలం సృష్టించడం అత్యంత అగాంధీయ చర్య” అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంఓ అధికారిక ఖాతాలను ట్యాగ్ చేస్తూ, “బాపూ జీవించి ఉంటే నా పేరుతో ఇలాంటివి చేయవద్దని చెప్పేవారు” అని వ్యాఖ్యానించారు.

‘గేట్‌వే ఆఫ్ హైదరాబాద్’గా మూసీ అభివృద్ధి

మూసీ నది పరిసర ప్రాంతాలను ఆధునికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బాపూఘాట్‌ను “గాంధీ సరోవర్”గా అభివృద్ధి చేసి, ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం, టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఎకో థీమ్ పార్క్, బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ సెంటర్ వద్ద పర్యాటక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక హిమాయత్ సాగర్ అప్రోచ్ రోడ్డును అత్తాపూర్‌కు అనుసంధానించే ఫ్లైఓవర్, గాంధీ సరోవర్ చుట్టూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేసి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా అనుసంధానం చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు, నగర అభివృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. వరద నియంత్రణ, తాగునీటి నిర్వహణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

బాధితుల నిరసనలు, విపక్షాల విమర్శలు

అయితే, ప్రాజెక్టు కారణంగా తమ నివాసాలు కోల్పోయే ప్రమాదం ఉందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంగర్ హౌజ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు నిరసనలు చేపట్టి, తమ ఇళ్లను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరైన పునరావాస ప్రణాళిక లేకుండా భూముల స్వాధీనం చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు.

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు కూడా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు బాధితులను కలిసి, వారి ఇళ్ల రక్షణ కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ సుందరీకరణ పేరుతో భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ స్పందన – పునరావాసానికి హామీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును సమర్థిస్తూ, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. బాధితులకు సరైన పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలు, రియల్ ఎస్టేట్ ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా విపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని విమర్శించారు.

ఇక సామాజిక సంస్థలు, ఆక్టివిస్టులు మాత్రం ప్రజలతో సంప్రదింపులు లేకుండా ప్రాజెక్టు ముందుకు సాగుతోందని ఆరోపిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల హక్కులను పరిగణలోకి తీసుకుని పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి vs పునరావాసం – ప్రధాన సమస్య

మొత్తంగా, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు హైదరాబాద్ అభివృద్ధికి దోహదం చేస్తుందా లేదా పేదల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యాలను సాధించడంతో పాటు, బాధితులకు న్యాయం చేసే విధంగా ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

Share this post
Exit mobile version