వ్యాపార రాజకీయ పార్టీల యుగం పోయి ప్రజల పార్టీల యుగం రానుంది
టి ఆర్ పి వ్యవస్థాపక అద్యక్షులు తీన్మార్ మల్లన్న
పెద్ద సంఖ్యలో టి ఆర్ పి లో చేరిన మాజీ మావోయిస్టులు
అడవి బిడ్డల అండతో రాజ్యాధికారం దిశగా టి ఆర్ పి
మల్లన్న ప్రసంగంతో ఆధిపత్య రాజకీయ పార్టీల్లో ఆందోళన
టి ఆర్ పి రాష్ట్ర అధ్యక్షురాలుగా పటేల్ వనజ
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో సంచలన రాజకీయ పరిణామం
అడవి బిడ్డల అండతో రాజ్యాధికారం దిశగా మాజీ మావోయిస్టుల భారీ చేరికలు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగేలా సరికొత్త సమీకరణాలు ప్రారంభమయ్యాయి. అణిచివేతకు గురైన వర్గాల గొంతుకగా ముందుకు వస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ లోకి మాజీ మావోయిస్టులు భారీగా చేరడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తీన్మార్ మల్లన్న అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో పీపుల్స్ వార్ మాజీ నాయకురాలు పటేల్ వనజక్క ఆధ్వర్యంలో మాజీ మావోయిస్టులు, ఇతర సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో చేరారు. అంతకుముందు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రజాస్వామ్య మార్గంలో తమ పోరాటాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ చేరుకుని సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మావోయిస్టు దళ కమాండర్ పటేల్ వనజక్క అధ్యక్షతన వందలాది మంది అడవి బిడ్డలు, ఉద్యమకారులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
మల్లన్న ప్రసంగం – ఆధిపత్య పార్టీలపై తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు నక్సలైట్లను, వారి సిద్ధాంతాలను వాడుకొని వదిలేశారని తీవ్రంగా విమర్శించారు. గతంలో రాజకీయ పార్టీలు అవసరాల కోసం మాత్రమే ఉద్యమకారులను ఉపయోగించుకున్నాయి కానీ వారికి అసెంబ్లీ వేదిక ఇవ్వలేదని అన్నారు. వనజక్క వంటి నాయకురాలు మన పార్టీలోకి రావడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ఆమె పోరాట జీవితం ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. అడవిలో మీరు సాధించాలనుకున్న లక్ష్యాలను ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా సాధిద్దామని పిలుపునిచ్చారు. ఇది వ్యాపార పార్టీల యుగం కాదని ప్రజల పార్టీ రాజ్యాధికారానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
టి ఆర్ పి రాజకీయ కీలక నిర్ణయాలు
టీఆర్పీ ఈ సందర్భంగా తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను స్పష్టంగా వెల్లడించింది మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తామని పార్టీతో పాటు అధికారంలో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. మాజీ మావోయిస్టుల సలహాలు, ఆమోదంతోనే పార్టీ మేనిఫెస్టోకు తుది రూపం ఇస్తామని తెలిపారు. ప్రజలను చైతన్యం చేయడం కోసం జూన్ రెండు నుండి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభిస్తామని, భువనగిరిలో వేలాది మంది మాజీ నక్సలైట్లతో మహా గర్జన సభ నిర్వహిస్తామని మల్లన్న తెలిపారు.
మాజీ మావోయిస్టుల భావోద్వేగ వ్యాఖ్యలు
పార్టీలో చేరిన మాజీ మావోయిస్టు నాయకులు పటేల్ వనజక్క మాట్లాడుతూ ఏండ్ల తరబడి మేము అడవుల్లో జీవిస్తూ, పీడిత వర్గాల కోసం పోరాటం చేశాం. కానీ మా లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదని, ఇప్పుడు మల్లన్న మమ్మల్ని ప్రజాస్వామ్య మార్గంలోకి తీసుకువస్తూ, అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా నిలబెడతామని హామీ ఇచ్చారని అన్నారు. మేము అనుకున్న మార్పులను చట్టాల రూపంలో తీసుకురావడానికి ఇది ఒక చివరి అవకాశమని భావించి టీఆర్పీలో చేరుతున్నామని తెలిపారు. మా భావజాలం కలిగిన వేలాది మంది త్వరలోనే భారీగా పార్టీలో చేరతారని తెలిపారు. వేల సంవత్సరాల నుండి అణచివేయబడిన ఈ దేశ శ్రమజీవులు, ఉత్పత్తి కులాల వారు మెజార్టీ బహుజన వర్గాల విముక్తి కోసం సర్దార్ సర్వాయి పాపన్న, ఛత్రపతి శివాజీ, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు ఎంతో మంది మహానీయులు త్యాగపూరిత ఉద్యమాలు చేశారని, స్వాతంత్రం వచ్చి 80 ఏండ్లు కావస్తున్నా నేటికి మెజార్టీ ప్రజలైన బహుజనులకు మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారినాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తీవ్ర అణచివేతకు వ్యతిరేకంగా నాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు అమరులయ్యారని, ఆ అమరుల ఆశయ సాధనకు టి ఆర్ పి పార్టీలో చేరి పని చేస్తానని అన్నారు.
ఈ చేరికలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయనున్నాయి. ముఖ్యంగా పీడిత వర్గాలు, అడవి ప్రాంతాల ప్రజలు, ఉద్యమకారుల మధ్య టీఆర్పీకి కొత్త జవసత్వాలను అందించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో పీడిత వర్గాల గొంతు వినిపించాలంటే అది టి ఆర్ పి ద్వారానే సాధ్యమని మల్లన్న స్పష్టం చేశారు. 2028 ఎన్నికల్లో రాజ్యాధికారం సాధించడం లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.
పార్టీల చేరిన వారిలో స్వర్ణక్క, అనసూర్య, గిరిగాని బిక్షపతి గౌడ్, న్యాయవాది జన్ను పద్మ, చిలువేరు రమ్య, తాడూరి మోహన్, ఐరబోయిన రాజు యాదవ్, ఉపేంద్ర, స్వరూప, బాబన్న, స్వామి, గాలీబు సన్నీ, సరిత, కృష్ణ, గణేష్, పుట్టి రవి, తక్కలప్పల్లి రవి, ఏపూరి సాయికృష్ణ, స్వర్ణక్క తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ పి పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు వట్టే జానయ్య, బుర్ర మల్లేశం, నీరజ గౌడ్, మదన్ మోహనాచారి, ఎలబోయిన ఓదెలు, లింగం, మాదం రజనీకుమార్ యాదవ్, మార్క శ్రీనివాస్, గట్ల రాజన్న, వెంకటేష్ గౌడ్, ఐనవోలు మల్లికార్జున శాస్త్రి, పుట్ట రాజు మాదిగ, భద్రకాళి రమణ తదితరులు పాల్గొన్నారు.

