వరంగల్, హనుమకొండ జిల్లా లను విలీనం చేయాలని పౌర సంఘాలు, మేధావుల డిమాండ్
హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనం చేసి వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని పౌర సంఘాల నాయకులు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
హనుమకొండ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. నగర అభివృద్ధి కోసం జిల్లాల ఏకీకరణ అవసరమని పాల్గొన్న వారు తెలిపారు.
తెలంగాణలో గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమైందని, ఇతర ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందలేదని వారు పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమతుల అభివృద్ధి జరుగుతుందనే ఆశలు నెరవేరలేదని అభిప్రాయపడ్డారు.
గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వరంగల్ నగరం విభజనకు గురై అభివృద్ధి దెబ్బతిందని వారు అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా జిల్లాల విలీనంపై, నగర అభివృద్ధిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కొండూరు సుధాకర్ ప్రభుత్వ గణాంకాలను ఉదహరిస్తూ, ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోని కొత్త జిల్లాలు ఇతర జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయని, హనుమకొండ అభివృద్ధి సూచికల్లో తక్కువ స్థానంలో ఉందని తెలిపారు.
వరంగల్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, గతంలో జిల్లాల ఏకీకరణపై వచ్చిన ప్రతిపాదనలు రాజకీయ కారణాలతో ముందుకు సాగలేదని చెప్పారు. వరంగల్ చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇతర వక్తలు నగర అభివృద్ధికి అవసరమైన ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ఐక్యంగా కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వడ్డె రవీందర్, టి. శ్రీనివాస్, సీనియర్దా జర్నలిస్ట్ దాసరి కృష్ణా రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, వి. బాబురావు, న్యాయవాదులు చిల్లా రాజేంద్ర ప్రసాద్, జిలకర శ్రీనివాస్, సాయిని నరేందర్, సంఘాల నాయకులు సోమ రామమూర్తి, సంఘాని మల్లేశ్వర్, డాక్టర్ వీరస్వామి, రాయపురపు సాంబయ్య, సోమిడి శ్రీనివాస్, రాజ్ మహమ్మద్, పటేల్ వనజ, సింగారపు అరుణ, మాదిరెడ్డి మల్లారెడ్డి, దార బోయిన సతీష్, డాక్టర్ సుధాకర్, పల్లపు సమ్మయ్య, చందా మల్లయ్య, మండల కుమారస్వామి, ఏటిగడ్డ అరుణ, బక్కి యాదగిరి, మధార్ తదితరులు పాల్గొన్నారు.
నగరాభి వృద్ధికి హనుమకొండను వరంగల్లో విలీనం చేయాలి

