హైదరాబాద్: ప్రాణాలను కాపాడే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) ప్రాధాన్యతను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ఎన్ఆర్ఐ డా. సతీష్ కత్తుల ప్రారంభించారు.
అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ సతీష్ కత్తుల ములుగు జిల్లాకు చెందిన వారు. వైద్య రంగంలో అందరికి ఉప యోగపడేవిదంగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్దం ఈ కేంద్రానికి అవసరమైన పరికరాలను ఆయన విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా డా. సతీష్ కత్తుల మాట్లాడుతూ, ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. “సీపీఆర్ అనేది అనేక ప్రాణాలను రక్షించే కీలకమైన విధానం. శిక్షణార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు మానికిన్లు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్లు (AEDలు) అందించగలగడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
ఇప్పటివరకు సీపీఆర్ అవగాహన శిబిరాలు అప్పుడప్పుడు మాత్రమే నిర్వహించేవారని, అయితే ఇప్పుడు శాశ్వత కేంద్రం ఏర్పాటు కావడం ద్వారా నిరంతర శిక్షణ అందుబాటులోకి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కేంద్రానికి ఇండో-యూఎస్ కమ్యూనిటీ సీపీఆర్ మరియు ప్రాజెక్ట్ హార్ట్ ఇండియా సంస్థలు శిక్షణ, సాంకేతిక సహకారం అందించనున్నాయి.
కాన్హా ఆశ్రమంలోని ఈ సీపీఆర్ శిక్షణ కేంద్రం ద్వారా సాధారణ ప్రజలు గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించే నైపుణ్యాలను నేర్చుకొని, అనేక ప్రాణాలను కాపాడ వచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు.

