హనుమకొండ, డిసెంబర్ 18, 2025
నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ
నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నాయకత్వంలో అంబేద్కర్ కూడలి వద్ద ఈ ర్యాలీ చేపట్టారు.
ఏఐసీసీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యలను ఢిల్లీ కోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో, ఆ అంశాలను ప్రజలకు వివరించేందుకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రతిపక్ష గొంతులను అణిచివేసేందుకు బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈడీ చర్యలపై గంభీరమైన ప్రశ్నలు లేవనెత్తాయని వారు పేర్కొన్నారు.
ర్యాలీ జరుగుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, లైబ్రరీ చైర్మన్ అజీజ్, మునిసిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయశ్రీ రాజాలీ, మామిండ్ల రాజు, దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్, అంకుష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ, ఎస్సీ సెల్ చైర్మన్ డా. పెరుమాండ్ల రామకృష్ణ, బీసీ సెల్ చైర్మన్ విక్రమ్, పులి అనిల్, గుంటి స్వప్న, సమత, నసీం జా, మాజీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

