Site icon MANATELANGANAA

దేవాదుల సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి – గోదావరి జాలలకు రాజకీయ రంగు తగదు

గోదావరి జలాలపై రాజకీయాలకు తావులేదని స్పష్టం

హైదరాబాద్‌: దేవాదుల ప్రాజెక్టు సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాల వివాదంపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేసారు.

గోదావరి జలాలకు రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ఈ కీలక సమయంలో ఆరోపణలు, అబద్ధాల ప్రచారాలు ప్రయోజనం ఇవ్వవని స్పష్టం చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, అప్పుడే పూర్తి చేసి ఉంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేదని ఆయన అన్నారు. నిధులు, నీళ్ల కోసం పోరాడి తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు. గత 10 ఏళ్లలో చిత్తశుద్ధితో ప్రాణహిత, ఎస్సార్ఎస్పీ, దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే 967 టీఎంసీల నీటివాటాను వినియోగించుకునే అవకాశం ఉండేదన్నారు. అప్పుడు వరద జలాల్లోనూ వాటా అడిగే స్థితి వచ్చేదని వ్యాఖ్యానించారు.

గోదావరి నదిపై కాళేశ్వరం తప్ప మిగతా ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. 2001లో దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని, ఇప్పటికీ నిర్మాణం కొనసాగుతుండటం విచారకరమన్నారు. రూ.6,000 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.18,500 కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు చేసి రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

తెలంగాణపై రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారం ఉందని వెల్లడించిన సీఎం, అయినప్పటికీ అభివృద్ధి పనుల్లో వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు. తుమ్మిడి హట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, భూమి లోపల ఏర్పడిన మార్పులను వివిధ ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ ప్రాజెక్టును గాలికి వదిలేయబోమని, తిరిగి ఉపయోగంలోకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.

కృష్ణా జలాలపై అపోహలు సృష్టించారని, అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని చెప్పారు. గోదావరి జలాల అంశంపై బడ్జెట్ సమావేశాల్లో ఒక రోజు చర్చకు సిద్ధమని ప్రకటించారు. గత 10 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, చేసిన తప్పులు వివరించాలని ప్రతిపక్షాలను సవాల్ చేశారు. తమ రెండేళ్ల పాలనలో తప్పులు ఉంటే సవరించుకుంటామని తెలిపారు.

పక్క రాష్ట్రాలకు నీళ్లు తరలిస్తారన్న ఆరోపణలను ఖండించిన సీఎం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు.

ప్రతి పొలానికి సాగునీరు, ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 2034 వరకు తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలని, వాకింగ్, యోగ చేయాలని, మంచి పుస్తకాలు చదవాలని సూచించారు. ప్రజలపై విషం కక్కే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు.

గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడుకుంటామని, నికర మరియు వరద జలాల్లో వాటాను వదులుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Share this post
Exit mobile version