న్యూఢిల్లీ,24,2025: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పలు కీలక అంశాలపై సమర్పించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్రం సహకరించాలని అభ్యర్థించారు.
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-IIపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం నడుస్తున్న ఫేజ్-Iలో మూడు కారిడార్లు 69 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారని, దాని నిర్మాణ వ్యయం రూ. 22,000 కోట్లు అయినట్లు తెలిపారు. గత 10 ఏళ్లలో మెట్రో విస్తరణపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ, నగరంలోని ఇతర ప్రాంతాలకూ మెట్రో సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-IIకి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్రానికి 2023 నవంబర్ 4న గృహ, పట్టణ అభివృద్ధి శాఖకు సమర్పించిందని వివరించారు. ఫేజ్-IIలో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్లు ఉంటాయని, ఇది రాష్ట్రం, కేంద్రం సంయుక్తంగా చేపట్టాల్సిన ప్రాజెక్టు (జేవీ) అని చెప్పారు. మొత్తం వ్యయం రూ. 24,269 కోట్లు కాగా, అందులో కేంద్రం వాటా 18 శాతం (రూ. 4,230 కోట్లు), రాష్ట్రం వాటా 30 శాతం (రూ. 7,313 కోట్లు), మిగిలిన 48 శాతం (రూ. 11,693 కోట్లు) రుణంగా ఉంటుందని వివరించారు. చెన్నై, బెంగళూరు మెట్రో ప్రాజెక్టులకు గతంలో మంజూరులు ఇచ్చినట్లు గుర్తు చేస్తూ, హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకూ త్వరగా ఆమోదం ఇవ్వాలని కోరారు.
మరొక ముఖ్య అంశంగా ప్రాంతీయ రింగు రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులుగా ఉత్తర భాగం (సంగారెడ్డి – నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – భువనగిరి – చౌటుప్పల్) మరియు దక్షిణ భాగం (చౌటుప్పల్ – అమన్గల్ – షాద్నగర్ – సంగారెడ్డి) రింగు రోడ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఉత్తర భాగానికి భూముల సేకరణ 2022లో ప్రారంభమైందని, రాష్ట్రం ఇందులో 50 శాతం ఖర్చును భరిస్తోందని తెలిపారు. ఇప్పటికే 90 శాతం భూముల సంబంధిత ప్రతిపాదనలను ఎన్హెచ్ఏఐకు పంపారని, ఎన్హెచ్ఏఐ ఇప్పటికే టెండర్లు కూడా పిలిచిందని వివరించారు. దక్షిణ భాగాన్ని కూడా అదే సమయంలో చేపడితే భవిష్యత్తులో భూసేకరణ, నిర్మాణ వ్యయాలు పెరగకుండా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగానికి కూడా 50 శాతం భూసేకరణ వ్యయం భరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రైల్వే మార్గాన్ని కూడా 370 కిలోమీటర్ల మేర ప్రతిపాదించినట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఔషధ ఉత్పత్తుల్లో దేశవ్యాప్తంగా 35 శాతం వాటా కలిగి ఉందని గుర్తు చేసిన సీఎం, బందరు పోర్ట్ నుండి హైదరాబాద్ డ్రై పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం ఇవ్వాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇది రవాణా ఖర్చులు తగ్గించడమే కాకుండా, ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందని, కొత్త పరిశ్రమలు, ఉద్యోగావకాశాలను తీసుకొస్తుందని పేర్కొన్నారు.
సెమీకండక్టర్ పరిశ్రమకు ప్రోత్సాహం ఇవ్వాలన్న ఆయన, ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్లో AMD, Qualcomm, NVIDIA వంటి ప్రముఖ సంస్థల పరిశోధనా కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అవసరమైన మౌలిక వసతులు, నైపుణ్యం గల మానవ వనరులు తెలంగాణలో సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ISM ప్రాజెక్టుకు ఆమోదం తెలిస్తే పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగి, లక్షలాది ఉద్యోగాలు కల్పించవచ్చని, 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో భారత్ లక్ష్యంగా పెట్టుకున్న \$500 బిలియన్ మార్క్కి Telangana కీలక భూమిక పోషించవచ్చని చెప్పారు.
రక్షణ రంగంలోనూ హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొంటూ, DRDO, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు (PSUs) ఆధ్వర్యంలో 1,000కి పైగా MSMEలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయని వివరించారు. ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.
మరోవైపు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పటికే హైదరాబాద్కు కేటాయించిన 2000 ఈవీ బస్సులతోపాటు అదనంగా 800 బస్సులు అవసరమని విజ్ఞప్తి చేశారు. నగర విస్తరణను దృష్టిలో ఉంచుకుని, PM-eBus స్కీమ్ కింద ఈ బస్సులు మంజూరు చేయాలని కోరారు. RTC డ్రైవర్లు, మెకానిక్లు నిర్వహణకు హైబ్రిడ్ జీసీసీ మోడల్ను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఒక డీజిల్ బస్సును రెట్రోఫిట్ చేసి విజయవంతంగా నడుపుతున్నట్లు తెలిపారు. ఇకముందు డీజిల్ బస్సులకూ రెట్రోఫిట్మెంట్కు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తక్షణ ఆమోదం కోసం ప్రధాని మోదీ, సంబంధిత మంత్రులను కలిసి చర్చలు జరిపారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లయితే, తెలంగాణ – ముఖ్యంగా హైదరాబాద్ – అభివృద్ధిలో మరో అడుగు ముందుకు వేయనుంది.