Site icon MANATELANGANAA

గురుకులాల ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేసిన సిఎం

cm revanth reddy

హైదరాబాద్, మే 28: తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో జరిగిన తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థ (TGSWREIS) అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకులాల నుంచి ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులతో పాటు, పదోతరగతి, ఇంటర్మీడియట్‌ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థుిలకు ముఖ్యమంత్రి ప్రోత్సాహకాలు అంద చేసారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రయత్నిస్తున్న గురుకులాలకు కూడా ప్రోత్సాహకాలు అందించారు.

“చదువు మినిషిని మారుస్తుంది”
విద్యార్థుల చిత్రకళా ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే శక్తి మన విద్యార్థుల్లో ఉంది. మీరు చదువులో మెరుగుపడితే, మీ కుటుంబానికే కాదు, రాష్ట్రానికి, దేశానికే గర్వకారణంగా మారుతారు,” అని పేర్కొన్నారు. సమాజంలోని అసమానతలు తొలగించి సమానతతో కూడిన రాష్ట్ర నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టంచేశారు.


ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలిసారిగా ఒక దళిత విద్యార్థిని వైస్ చాన్సలర్‌గా నియమించామని గుర్తుచేశారు సీఎం. అలాగే రాష్ట్రంలో ఎన్నో కీలక పదవుల్లో దళితులు అడుగుపెట్టారంటే, అది కేవలం వారి కులం వల్ల కాకుండా విద్య కారణంగానే సాధ్యమైందన్నారు.



“ఇదే మీ జీవితంలో మలుపు తిప్పే దశ. ఇప్పుడు మీరు చూపించే కృషి, నిరంతర పట్టుదలే మీ భవిష్యత్‌ను నిర్మించబోతుంది. 25 ఏళ్లు వచ్చేవరకు ఊహల్లో కాకుండా పాఠాలలో మునిగి చదవండి. చదువుతోనే సమాజంలో గౌరవం వస్తుంది. తప్పుదోవ పట్టినట్లయితే తల్లిదండ్రుల తల వంచుతారు. చదువులో రాణిస్తే ఊరు గర్వపడే స్థాయికి ఎదగొచ్చు.”


తెలంగాణలో ప్రతిభావంతులైన అవకాశాలకోసం ఎదురుచూస్తున్న యువతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు” ప్రారంభించినట్టు తెలిపారు సీఎం. “మన గురుకులాల్లో ఉన్న విద్యార్థుల్లో అంతులేని ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉంది. వాళ్లు భవిష్యత్తులో తప్పకుండా మెరవగలరన్న నమ్మకం ఉంది,” అన్నారు.

“మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. నేను మీతోనే ఉన్నాను. మీ భవిష్యత్తు उज్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.” అన్నారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సలహాదారులు వేం. నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.


Share this post
Exit mobile version