Site icon MANATELANGANAA

ఏసీబీ వలలో చేర్యాల తహసీల్దార్

సిద్దిపేట, జూలై 6: సిద్దిపేట జిల్లా చెర్యాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం లంచం తీసుకుంంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం, నాగపురి గ్రామానికి చెందిన భూములకు సంబంధించిన 11 నాలా (NALA) కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి తహసీల్దార్ ఫిర్యాదుదారుని నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేశారు. ఇందులో ఇప్పటికే ఎనిమిది దరఖాస్తులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు సోమవారం మధ్యాహ్నం సుమారు 2:40 గంటలకు చెర్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఉచ్చుపన్ని, తహసీల్దార్ లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.70 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు లంచం స్వీకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ పేర్కొంది.

నిందితుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను వెల్లడించడం లేదని ఏసీబీ తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Share this post
Exit mobile version