25 నుంచి 28కు పెరిగిన జిల్లాల సంఖ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా సౌలభ్యం కోసం మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25 నుంచి 28కు పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్ను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అదే విధంగా, కొన్ని జిల్లాల్లో పునర్వీభజన కూడా చేపట్టనున్నట్లు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు 17 జిల్లాల్లో డివిజన్లు, మండలాల పరిధుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. ఈ చేర్పులు, మార్పులు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఇక అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇప్పటివరకు ఉన్న రాయచోటిని మార్చి, మదనపల్లెను కొత్త జిల్లా కేంద్రంగా నిర్ణయించారు. అలాగే అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి మార్చారు. రాజంపేటను కడప జిల్లాలో కొనసాగించగా, సిద్ధవటం, ఒంటిమిట్ట, రైల్వేకోడూరు నియోజకవర్గాలను తిరుపతి జిల్లాలోకి చేర్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

