బుద్ధుడు విగ్రహారాధన వద్దని చెప్పాడు అంటారు…
కానీ మీరేమో ప్రతి ప్రాచీన శిల్పాన్నీ బౌద్ధానికి ముడిపెడుతున్నారు… అవలోకేతీశ్వరుడు, బోధిసత్వులు, బుద్ధ విగ్రహాలు అంటూ విపరీతమైన ప్రచారం చేస్తున్నారు… ఇది హిందూ మతాన్ని డిస్టర్బ్ చేయడానికి లేదా హిందూ సమాజాన్ని విడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపిస్తోంది అని సోషల్ మీడియా వేదికగా చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు… దూషిస్తున్నారు కూడా…
అందుకే ఈరోజు భావోద్వేగాలతో కాదు… పురావస్తు ఆధారాలు, శాసనాలు, శిల్పాలు, యాత్రికుల వర్ణనలు ఆధారంగా ఒక ముఖ్యమైన చారిత్రక విషయాన్ని వివరించడానికి ఈ పోస్టు రాస్తున్నాను.
దయచేసి ఓపికతో చివరి వరకు చదవండి.
భారతదేశంలో నేటి తరహా దేవాలయ విగ్రహ వ్యవస్థ మొదటి నుంచే ఉందా అనే ప్రశ్నకు చరిత్రలో స్పష్టమైన సమాధానం కనిపించదు.
ప్రాచీన భారత సమాజాల్లో మొదట కనిపించేది ప్రకృతి ఆధారిత విశ్వాస వ్యవస్థ.
గ్రామీణ సమాజాలు:
చెట్లు
పర్వతాలు
నాగ శిలలు
రాళ్లు
అమ్మతల్లి చిహ్నాలు
యక్ష యక్షిణి విశ్వాసాలు
వంటి స్థానిక సంప్రదాయాలను అనుసరించేవి.
ఇవి నేటి తరహా భారీ దేవాలయ వ్యవస్థలు కాదు. ఎక్కువగా ప్రకృతి చిహ్నాల చుట్టూ ఏర్పడిన ప్రజా విశ్వాసాలు.
తర్వాత భారతదేశ చరిత్రలో పెద్ద స్థాయిలో శాసన ఆధారాలతో కనిపించే వ్యవస్థ బౌద్ధ సంప్రదాయం.
ముఖ్యంగా అశోక చక్రవర్తి కాలం నుండి బ్రాహ్మీ లిపిలో శాసనాలు, స్తూపాలు, ధర్మ చిహ్నాలు, బౌద్ధ నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
సాంచీ, భార్హుట్, అమరావతి వంటి ప్రాంతాల్లో కనిపించే స్తూపాలు భారతదేశంలో అత్యంత ప్రాచీన శిల్ప సంప్రదాయానికి ప్రధాన ఆధారాలుగా నిలుస్తాయి.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి.
ప్రారంభ బౌద్ధ కళలో బుద్ధుడిని మనిషి రూపంలో చూపించలేదు.
ఆయన స్థానంలో:
ధర్మచక్రం
బోధివృక్షం
ఖాళీ సింహాసనం
బుద్ధ పాదాలు
స్తూపం
వంటి చిహ్నాలను ఉపయోగించారు.
అంటే ప్రారంభ దశలో “ప్రతీక ఆరాధన” ఎక్కువగా కనిపిస్తుంది.
తర్వాత సాధారణ శకం మొదటి రెండవ శతాబ్దాల సమయంలో గాంధార మరియు మథుర కళాశైలుల్లో బుద్ధుని మానవ రూప శిల్పాలు కనిపించడం ప్రారంభమైంది.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కనిపిస్తుంది.
బౌద్ధ కట్టడాల్లో ప్రధాన కేంద్రంగా స్తూపం, బుద్ధ చిహ్నాలు, బోధిసత్వ శిల్పాలు ఉండగా… చుట్టూ యక్షులు, యక్షిణులు, నాగ రూపాలు, మిధున దంపతులు, వృక్ష దేవతలు వంటి స్థానిక ప్రజా సంప్రదాయాల శిల్పాలు కూడా కనిపిస్తాయి.
అంటే బౌద్ధ సంప్రదాయం స్థానిక విశ్వాసాలను పూర్తిగా తుడిచిపెట్టకుండా… వాటిని ఒక పెద్ద సాంస్కృతిక వేదికలో కలుపుకొని ముందుకు తీసుకెళ్లినట్టు పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి.
అందుకే మనకు అనేక ప్రాచీన బౌద్ధ కట్టడాల్లో స్థానిక ప్రజా సంస్కృతి మరియు బౌద్ధ తత్వం కలిసి కనిపిస్తాయి.
ప్రారంభ బౌద్ధ శిల్పాలను నేటి అర్థంలో కేవలం “దేవతా విగ్రహాలు”గా మాత్రమే చూడలేం.
ఆ శిల్పాలు ప్రధానంగా:
ధ్యానం
కరుణ
జ్ఞానం
సమత్వం
ధర్మబోధ
వంటి గుణాలకు ప్రతీకలుగా కనిపిస్తాయి.
శిల్పాలు ప్రజలకు బోధనా పద్ధతిగా, జ్ఞాపక చిహ్నాలుగా, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంగా ఉపయోగించబడ్డాయి.
తర్వాతి శతాబ్దాల్లో భారతదేశ కళా సంప్రదాయంలో శైవ శిల్ప వ్యవస్థ బలపడినట్టు పురావస్తు ఆధారాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా ఆరో నుండి ఏడవ శతాబ్దాల మధ్య ఎల్లోరా, ఎలిఫెంటా, బాదామి వంటి ప్రాంతాల్లో శైవ గుహాలయాలు, శిల్ప సంప్రదాయాలు విస్తృతంగా కనిపించడం ప్రారంభమవుతుంది.
ఇక్కడ కూడా స్థానిక యక్ష, నాగ, ద్వారపాలక సంప్రదాయాలు శైవ కళలో భాగమై కనిపిస్తాయి.
తర్వాతి కాలంలో జైన శిల్ప సంప్రదాయం మరింత విస్తరించింది. తీర్థంకర విగ్రహాలు, యక్ష యక్షిణి సహచర రూపాలు, ద్వారపాలకులు వంటి అంశాలు జైన కళలో భాగమయ్యాయి.
ఆ తర్వాత పదకొండవ శతాబ్దం నుండి ఆలయ కేంద్రిత వైష్ణవ భక్తి వ్యవస్థ మరింత బలపడినట్టు కనిపిస్తుంది. అవతార సిద్ధాంతం, విశిష్టాద్వైతం, ద్వైతం వంటి తాత్విక వ్యవస్థలతో దేవాలయ ఆధారిత భక్తి సంప్రదాయం మరింత వ్యవస్థీకృతమైంది.
ఈ మొత్తం చారిత్రక పరిణామాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
భారతదేశంలో విగ్రహ సంప్రదాయం ఒక్కరోజులో ఒక్క మతం ద్వారా పుట్టలేదు.
మొదట ప్రకృతి చిహ్నాలు
తర్వాత గుణాల ప్రతీకలు
తర్వాత ఆధ్యాత్మిక వ్యక్తుల శిల్పాలు
తర్వాత దేవాలయ కేంద్రిత దేవతా వ్యవస్థలు
అనే ఒక దీర్ఘ చారిత్రక పరిణామ క్రమం కనిపిస్తుంది.
అయితే పురావస్తు ఆధారాల పరంగా చూస్తే స్తూపాలు, చైత్యాలు, బోధిసత్వ శిల్పాలు, బౌద్ధ కళా నిర్మాణాలు భారతదేశంలో అత్యంత ప్రాచీనంగా, విస్తృతంగా కనిపించే వ్యవస్థీకృత శిల్ప సంప్రదాయాల్లో ఒకటిగా నిలుస్తాయి.
అందువల్ల భారతదేశంలో విగ్రహ మరియు శిల్ప సంప్రదాయ అభివృద్ధిలో బౌద్ధ కళ కీలక పాత్ర పోషించిందని చెప్పడానికి బలమైన పురావస్తు ఆధారాలు కనిపిస్తున్నాయి.
మన చరిత్రను అర్థం చేసుకోవాలంటే భావోద్వేగాలతో కాదు… శాసనాలు, శిల్పాలు, పురావస్తు ఆధారాలు, యాత్రికుల వర్ణనలు, నిర్మాణ సంప్రదాయాలను కలిసి పరిశీలించాల్సిన అవసరం ఉంది.
మీ
బండపల్లి శివారెడ్డి.
(భోది సత్వడు FACEBOOKWALL)

