తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై పలు రాజకీయ ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, సాగునీటి అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుదారి పట్టిస్తూ బీఆర్ఎస్ నేతలు అపవాదాలు చేస్తూ వచ్చారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడూ, ఇప్పుడూ బీఆర్ఎస్ నేతలు భిన్నంగా మాట్లాడుతున్నారని, ఇప్పుడు సెంటిమెంట్లు అద్దుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. “రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు కాంగ్రెస్ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించాం,” అని గుర్తు చేశారు.
2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వివరాలు
2016 సెప్టెంబర్ 21న ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి సీఎస్ఆర్, హరీష్ రావు పాల్గొన్నారని, సమావేశంలో గోదావరి జలాల పరిరక్షణ, వినియోగంపై కీలకంగా చర్చించామని రేవంత్ తెలిపారు. సమావేశం మినిట్స్ను తాను హరీష్ రావుకు పంపిస్తానని చెప్పారు. రాయలసీమకు నీటి తరలింపుకు ఇదే పునాది అయిందని తెలిపారు.
రాయలసీమ ప్రాజెక్టులపై స్పందన
కృష్ణా, గోదావరి బేసిన్లపై అప్పట్లో సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మధ్య మాట్లాడి ఒప్పందానికి వచ్చిన విషయాలను వివరించారు. “ఆ సమయంలో కేసీఆర్ గారు 400 టీఎంసీలు తీసుకోవచ్చని అన్నారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ ముందుకు వెళ్తోంది,” అన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణంపై విమర్శలు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని, తుమ్మిడిహెట్టి లాంటి ప్రాజెక్టులను గాలికొదిలారని విమర్శించారు. కమిషన్లకోసం లక్షకోట్లు ఖర్చుపెట్టి కూడా లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. “మేం ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నాం,” అని తెలిపారు.
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతుల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. “మీరు నిజంగా సహకరించాలంటే నిధులు ఇవ్వండి, మేము మీ ఫామ్ హౌస్కే వస్తాం. 50 వేల కోట్లు ఇవ్వండి, బాండ్లు సమర్పిస్తాం,” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు సూచన
ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి, “కేసీఆర్ చెప్పారనే ఆధారంగా మీరు ప్రాజెక్టులకు అనుమతులు ఆశించకండి. మీకెంతో కేంద్రం సహకరిస్తుందన్న భ్రమ వద్దు. మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసీ ఇవ్వండి, మిగిలిన నీటిని మీరు వినియోగించుకోండి,” అన్నారు.
జల వివాదంపై కేంద్రాన్ని కలవనున్న తెలంగాణ ప్రతినిధులు
రేపు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ను కలిసే అవకాశం ఉందని సీఎం తెలిపారు. బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలను కేంద్రానికి వివరిస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలూ ఒకటిగా తెలంగాణ హక్కుల కోసం కృషి చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కిషన్ రెడ్డి పై ప్రశ్నలు
కిషన్ రెడ్డి అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకుండా కేంద్ర మంత్రిని ముందుగానే కలవడంపై సీఎం సందేహాలు వ్యక్తం చేశారు. “మేము కలుసుకోబోతున్నామని తెలిసి ముందు ఆయన కలవడంలో ఏ రాజకీయ వ్యూహం దాగుంది?” అని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కుల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.