వరంగల్: కిట్స్ వరంగల్ క్యాంపస్లోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో 59వ ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కిట్స్ వరంగల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE) విభాగం, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా)–వరంగల్ లోకల్ సెంటర్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
“Engineering Excellence for a Sustainable and Technologically Sovereign India” అనే అంశంపై సాంకేతిక ప్రసంగం నిర్వహించారు.
భారతదేశ ప్రఖ్యాత ఇంజినీర్, భారతరత్న అవార్డు గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఇంజినీర్స్ డేను నిర్వహిస్తున్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్ఐటీ వరంగల్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ మహేశ్వరపు సిద్దులు మాట్లాడుతూ, మాతృభాషలో శాస్త్రీయ, సాంకేతిక అంశాలను విద్యార్థులకు చేరవేయడం ద్వారా వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించవచ్చన్నారు. ఇంజినీరింగ్లో పాఠ్యపుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. డిజైనింగ్, ప్లానింగ్లో సమగ్ర ఇంజినీరింగ్ నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని, విద్యార్థుల్లో తార్కిక ఆలోచనా విధానాన్ని పెంపొందించడం ఇంజినీరింగ్ నైపుణ్యాలకు ప్రాథమికమని పేర్కొన్నారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) వరంగల్ లోకల్ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ ఎల్. అంజనేయులు, FIE మాట్లాడుతూ, “సైన్స్ అంటే తెలుసుకోవడం.. ఇంజినీరింగ్ అంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం” అని అన్నారు. నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య కలలను సాకారం చేసే శక్తిని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
ఇంజినీర్లు సమాజాన్ని సుస్థిరమైన వాతావరణంగా తీర్చిదిద్దడంతో పాటు సమాజం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు చూపగలరన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన EEE విభాగాన్ని కిట్స్ వరంగల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, ట్రెజరర్ పి. నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) వరంగల్ లోకల్ సెంటర్ గౌరవ కార్యదర్శి డాక్టర్ పి. మురళీధర్, FIE, సంయుక్త గౌరవ కార్యదర్శి డాక్టర్ ఆర్. శంకరయ్య, కిట్స్ డీన్ (అకడమిక్ అఫైర్స్) ప్రొఫెసర్ సూర నరసింహారెడ్డి, EEE విభాగాధిపతి డాక్టర్ ఎం. నరసింహారావు, అధ్యాపకులు డాక్టర్ బి. విజయ్ కుమార్, డాక్టర్ జి. సునీల్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, PRO డాక్టర్ డి. ప్రభాకర చారి, ఇతర అధ్యాపకులు, సిబ్బంది, సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

