భూ సేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 


* రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి…

* ఆర్ఆర్ఆర్ అంతటికీ ఒకే నెంబర్ 

* ప్రత్యామ్నాయ భూ కేటాయింపులతో అటవీ భూముల స్వాధీనం 

* ఎన్ హెచ్ఏఐ పరిధి సమస్యలపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్: జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు.  నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. కలెక్టర్లు రైతులతో పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వురుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్ హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపార్టియేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణలో ఉన్న ఆటంకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. అలైన్ మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపున‌కు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు.  నాగ్ పూర్-విజయవాడ కారిడార్ లో ఖమ్మం జిల్లాలో భూ సేకరణ పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు ఉన్న జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్ హెచ్ఏఐ అధికారులు సూచిస్తున్నారని, దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని, జాతీయ రహదారిగానే దానిని కొనసాగించాలని మంత్రి తుమ్మల అభిప్రాయం వ్య‌క్తం చేశారు.  అనంతరం ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ నాగ్ పూర్-విజయవాడ కారిడార్ లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని, రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన చోట్ల అండర్ పాస్ లు నిర్మించాలని ఎన్ హెచ్ఏఐ అధికారులను కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు సభ్యడు అనిల్ చౌదరి బదులిచ్చారు. జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్‌ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదన సమీక్షలో వచ్చింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు స‌భ్యుడు అనిల్ చౌదరి తెలిపారు. గ్రావెల్ రహదారి నిర్మించడం వలన రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

రహదారుల సమీక్షలో...రైతన్నల కోణంలో సీఎం కీలక నిర్ణయాలు

భూ సేకరణలో కలెక్టర్లు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి.

తరతరాలు భూమినే నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగొద్దు

పరిహారం విషయంలో రాజీ పడొద్దు.

రైతులతో నేరుగా కలెక్టర్లే మాట్లాడాలి

విజయవాడ... నాగపూర్ కారిడార్ భూ సేకరణ వేగవంతం చేయాలి.

హైదరాబాద్ – మన్నెగూడ రహదారి పనులు త్వరగా ప్రారంభించాలి

హైదరాబాద్... విజయవాడ ఆరు లేన్ల రహదారి విస్తరణ పనులు రెండు నెలల్లో ప్రారంభించాలి.

* సమన్వయంతో ముందుకు సాగండి…

ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల, విజయవాడ-నాగ్ పూర్ కారిడార్ రహదారులకు సంబంధించి అటవీ శాఖ భూముల బదలాయింపు సమస్య స‌మీక్ష‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వ‌చ్చింది.  స్పందించిన ముఖ్యమంత్రి అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్ర‌భుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములను అటవీ శాఖకు బదలాయించి అటవీ శాఖ భూములను తీసుకొని రహదారుల నిర్మాణానికి ఉన్న ఆటంకాలను తొలగించాలని ముఖ్యమంత్రి సూచించారు.  వివిధ శాఖ‌ల ప‌రిధిలోని యుటిలిటీస్ తొలగింపునకు సంబంధించి చెల్లింపులు వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలుంటే ఎన్ హెచ్ఏఐతో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు. 

* హైదరాబాద్ -మన్నెగూడ రహదారి పనులు  సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. అందుకు ఎన్‌హెచ్ ఏఐ అధికారులు అంగీక‌రించారు.

* రెండు నెలల్లో హైదరాబాద్-విజయవాడ విస్తరణ పనులు

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులకు భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు మెంబర్ అనిల్ చౌదరిని కోరారు. రెండు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ఆయన బదులిచ్చారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి, సీఎంవో అధికారులు మాణిక్ రాజ్, చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్ హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్ డోబ్రియల్, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, జాయింట్ సెక్రటరీ హరీష్, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు