213 మంది ఖైదీలకు క్షమాభిక్ష...
* సత్ప్రవర్తన నేపథ్యంలో ముందస్తు విడుదల
* విడుదల కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి దరఖాస్తు చేసిన ఖైదీల కుటుంబ సభ్యులు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాలనలో దరఖాస్తులు అందజేశారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైన వారి వివరాలను హైలెవల్ కమిటీ ముందుంచారు. హైలెవల్ కమిటీ విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందు ఉంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు బుధవారం విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, ఎనిమిది మంది తక్కువ కాలం శిక్షపడిన వారు. వీరందరికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. మెరుగైన ప్రవర్తన ద్వారా సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారందరికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box