చిన్నారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి
అంగన్వాడీ కేంద్రం పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ జిల్లాలోని శామీర్పేట్ గ్రామంలోని అంగన్వాడీ - II కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు.
ఈ సందర్భంగా కేంద్రంలో పిల్లలకు అందించే ఆహారాన్ని పరిశీలించి, చిన్నారులకు అందించే ఆహారం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలతో శుచిరుచికరమైన భోజనాన్ని అందించాలని సూచించారు.
అలాగే వంట పాత్రలను తనిఖీ చేసి, కేంద్రంలోనూ, ఆహారం వండే వంట పాత్రల విషయంలో పరిశుభ్రతను పాటించాలని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చిన గుడ్ల నాణ్యతను పర్యవేక్షించి, కొలత ప్రకారంగా గుడ్లు ఉండే విధంగా సరిచూసుకోవాలని, ప్రతిరోజూ గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు సక్రమంగా అందించాలని అన్నారు.
కేంద్రంలోని బలహీనంగా ఉన్న పిల్లల బరువు, ఎత్తు కొలతలను పరిశీలించి, ప్రతి వారం చిన్నారుల బరువు కొలతలను ఎంతో జాగ్రత్తగా సరైన విధంగా నిర్వహించాలని, ఆ వివరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. అదే విధంగా సీడీపీఓలు, సూపర్వైజర్ లు ఈ అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలని, అలాగే పిల్లల బరువు, ఎత్తు కొలతలు వంద శాతం ఉండే విధంగా చూడాలని సూచించారు.
అదే విధంగా బలహీనంగా ఉన్న చిన్నారుల తల్లులతో మాట్లాడి, వారికి తగిన సూచనలు చేశారు. కేంద్రంలో అందించే ఆహారంతో పాటు ఎక్కువ సార్లు ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య లక్ష్మీ తల్లులకు సూచించారు. బలహీనంగా ఉన్న చిన్నారులకు ఆశాలు, అంగన్వాడీలు బలమైన ఆహారాన్ని అందించి, తగిన విధంగా వారిని ఆసుపత్రిలో చూపించాలని తెలిపారు.
ఈ పర్యవేక్షణలో ఆయన వెంట డీడబ్ల్యూఓ జయంతి, సీడీపీఓ రమాదేవి, అంగన్వాడీ టీచర్ స్వరూప, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-------ends
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box